Reading Time: < 1 minute
MRI పని అయిపోయిందా? రేడియేషన్ లేకుండా శరీరం మొత్తం చెక్.. కొత్త స్కానర్ సంచలనం!

కృత్రిమ మేధ (AI) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న వేళ, ఇప్పుడు ఎంఆర్‌ఐ (MRI) స్కానింగ్‌కు ప్రత్యామ్నాయంగా ఓ కొత్త సాంకేతికత చర్చనీయాంశంగా మారింది. ఏఐ ఇమేజ్ జనరేషన్ మోడల్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మిడ్‌జర్నీ సంస్థ తాజాగా “మిడ్‌జర్నీ స్కానర్” అనే వినూత్న వైద్య పరికరాన్ని పరిచయం చేసింది. ఈ పరికరం కేవలం ఒక నిమిషంలోనే పూర్తి శరీరాన్ని స్కాన్ చేసి, ఎంఆర్‌ఐకు సమానమైన ఫలితాలను అందించగలదని కంపెనీ చెబుతోంది.

మిడ్‌జర్నీ సీఈఓ డేవిడ్ హోల్జ్ ఈ ప్రాజెక్ట్‌ను విచిత్రమైనదైనా, అత్యంత ఆశాజనకమైనదిగా అభివర్ణించారు. ఈ స్కానర్ అల్ట్రాసౌండ్ సాంకేతికత ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు. స్కానింగ్ సమయంలో వ్యక్తి సుమారు ఒక నిమిషం పాటు నీటిలో నిలబడాలి. పరికరంలోని సెన్సార్లు వివిధ కోణాల నుంచి అల్ట్రాసోనిక్ తరంగాలను శరీరంలోకి పంపి, తిరిగి వచ్చే సంకేతాలను విశ్లేషిస్తాయి. అనంతరం కండరాలు, కొవ్వు, ఎముకలు, అంతర్గత అవయవాల వివరాలతో కూడిన 3D మ్యాప్‌ను రూపొందిస్తాయని డేవిడ్ హోల్జ్ వివరించారు.

ఈ సాంకేతికతలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భద్రత. సాధారణ ఎంఆర్‌ఐల మాదిరిగా అయస్కాంత క్షేత్రాలు లేదా సీటీ స్కాన్ల మాదిరిగా రేడియేషన్‌ను ఇది ఉపయోగించదు. కేవలం ధ్వని తరంగాలు, నీటితోనే స్కానింగ్ జరుగుతుంది. దీంతో రేడియేషన్ ప్రమాదం ఉండదని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ఎంఆర్‌ఐ పరీక్షలకు 30 నుంచి 90 నిమిషాల వరకు సమయం పట్టగా, ఈ స్కానర్ కేవలం ఒక నిమిషంలోనే ప్రక్రియను పూర్తి చేయగలదు.

అయితే ఈ పరికరం ప్రస్తుతం అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉంది. ఇంకా వైద్యపరంగా పూర్తిస్థాయి ధృవీకరణ పొందలేదు. రోగనిర్ధారణ కోసం వినియోగించాలంటే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అనుమతి అవసరం. వచ్చే ఏడాది శాన్‌ఫ్రాన్సిస్కోలో తొలి “మిడ్‌జర్నీ స్పా”ను ప్రారంభించి ఈ స్కానర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. భవిష్యత్తులో పూర్తి శరీర స్కానింగ్‌ను సాధారణ ఆరోగ్య పరీక్షగా మార్చడమే తమ లక్ష్యమని సంస్థ వెల్లడించింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..