Reading Time: < 1 minute
Epfo Pf Withdrawal Atm Upi Service Launch June Update

PF Withdrawal Via UPI-ATM: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఖాతాదారులకు కేంద్ర శ్రమ మంత్రిత్వ శాఖ ఒక అదిరిపోయే శుభవార్త అందించింది. పీఎఫ్ ఖాతాలో (PF Account) దాచుకున్న డబ్బులను ఇకపై నేరుగా ఏటీఎం (ATM), యూపీఐ (UPI) ద్వారా విత్‌డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. జూన్ నెల ముగిసేలోపే ఈ సరికొత్త సేవలను ఈపీఎఫ్‌ఓ సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గురువారం నాడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఈ కీలక అప్‌డేట్‌ను అధికారికంగా ప్రకటించింది.

ఈ నెల చివరి నుంచే అమల్లోకి..

కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే ప్రక్రియ (ATM-UPI PF Withdrawal) ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. జూన్ నెల ముగిసేలోపే ఈ కొత్త విధానం అమలు కానుంది. ఇందుకు సంబంధించిన ‘2.01 సర్వర్’ ప్రారంభం కాగానే ఈ స్కీమ్ లైవ్‌లోకి వస్తుంది. ఈ సర్వర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఖాతాదారులు యూపీఐ ద్వారా పీఎఫ్ నిధులను నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకోవచ్చు. ఆపై ఏటీఎం కార్డులను ఉపయోగించి ఆ నగదును విత్‌డ్రా చేసుకోవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు మంత్రిత్వ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

మంత్రి మున్సుఖ్ మాండవీయ ముందస్తు సంకేతాలు

ఈపీఎఫ్‌ఓ తీసుకొస్తున్న ఈ చారిత్రాత్మక మార్పుపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గత మే నెలలోనే కీలక సంకేతాలు ఇచ్చారు. జూన్ నెల నుంచి పీఎఫ్ ఖాతాదారులు యూపీఐ, ఏటీఎంల ద్వారా నగదు పొందే వీలుంటుందని ఆయన అప్పట్లోనే పేర్కొన్నారు. ఈపీఎఫ్‌ఓను పూర్తిగా డిజిటలైజ్ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనివల్ల పీఎఫ్ డబ్బుల విత్‌డ్రా ప్రక్రియ అత్యంత సులభతరం అవుతుందని చెప్పారు. చందాదారులు తమ స్వంత సొమ్మును డ్రా చేసుకోవడానికి ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి పెద్ద పెద్ద ఫారాలు నింపకుండా సులువుగా నగదు పొందేలా చేయడమే ఈ సరికొత్త విధానం ముఖ్య ఉద్దేశమని వివరించారు.