
తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీలో శుక్రవారంనాడు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం (19-06-26)నాడు ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద,భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు,శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు.
కాగా గురువారం (జులై 18) సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో గరిష్ఠంగా అల్లూరి జిల్లా కృష్ణాపురంలో 55.5మిమీ, మర్కాపురం జిల్లా మేడపిలో 54మిమీ వర్షపాతం నమోదయ్యింది. విజయనగరం జిల్లా జరజాపుపేటలో 47మిమీ, పల్నాడు జిల్లా మాడుగులలో 40మిమీ, విజయనగరం జిల్లా గుర్లలో 33.7మిమీ, విశాఖ జిల్లా పద్మనాభంలో 33మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని తెలిపారు.