Reading Time: 3 minutes
Cm Revanth Reddy Lb Nagar Hydraa Land Encroachments

CM Revanth Reddy : హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాల రక్షణ , భవిష్యత్తు అభివృద్ధి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీనగర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలకులు చేసిన తప్పులు, కబ్జాదారుల అక్రమాల వల్లే సామాన్య ప్రజలు ముంపునకు గురవుతున్నారని మండిపడ్డారు. ఎల్బీనగర్ ప్రాంతంపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటూనే, ప్రతిపక్షాల విమర్శలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కొడంగల్‌లో ఓడించినా.. మల్కాజ్‌గిరి ప్రజలు నిలబెట్టారు

తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ కుట్రల వల్ల తాను కొడంగల్‌లో ఓడిపోయినప్పుడు చాలా మంది హేళన చేస్తూ నవ్వుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆ కష్టకాలంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తనకు అండగా నిలబడి మల్కాజ్‌గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని చెప్పారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మి గెలిపిస్తే.. ఒకరు మంత్రి పదవి కోసం, మరొకరు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కోసం అందరినీ మోసం చేసి వెళ్లిపోయారని విమర్శించారు. అయితే ఆనాడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలు తనకు 30 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి, పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకగా నిలబెట్టారని కృతజ్ఞతగా గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్‌లో తాను చేసిన పోరాటాన్ని చూసే అధిష్ఠానం పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించిందని, ఆ తర్వాత మూడేళ్ల పోరాటంతో లక్షలాది మంది ఆశీస్సులతో ప్రజా పాలనను ఏర్పాటు చేసుకున్నామని వివరించారు.

ఎల్బీనగర్ వస్తే సొంతూరు వెళ్లినట్లే ఉంటుంది

ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తుంటారని సీఎం తెలిపారు. గతంలో ఇక్కడ వర్షాలు వచ్చి కాలనీలు మునిగిపోయినప్పుడు ఎంపీగా తాను స్వయంగా పర్యటించానని గుర్తుచేశారు. “నా సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ఎల్బీనగర్‌కు వచ్చినప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే వస్తుంది. ఇక్కడి ప్రజలు ఎంతో అభిమానంతో నన్ను పలుకరిస్తారు” అని భావోద్వేగంగా మాట్లాడారు. రంగారెడ్డి జిల్లాలో గతంలో కేవలం ఒక వైపు మాత్రమే అభివృద్ధి జరిగిందని.. ఎల్బీనగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, గుర్రంగూడ వంటి ప్రాంతాలను గత పాలకులు అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రూ. 2,400 కోట్లతో 240 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు.

ఎకో పార్క్ భూముల రక్షణ.. కబ్జాదారులకు హెచ్చరిక

గుర్రంగూడ ఎకో పార్క్ భూములను ప్రైవేట్ ఆస్తులుగా చూపిస్తూ లేఅవుట్లు చేసి అమ్ముకోవాలని కొందరు చూశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కానీ తాము సుప్రీంకోర్టులో ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి గెలిచామని, ఆ 424 ఎకరాల భూమిని నేషనల్ పార్క్‌గా ఇక్కడి ప్రజలకే అంకితం ఇచ్చామని స్పష్టం చేశారు. గుర్రంగూడ ఎకో పార్క్ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని హామీ ఇచ్చారు. చెరువులు, నాలాల కబ్జాల వల్లే బస్తీలు ముంపునకు గురవుతున్నాయన్న సీఎం.. కబ్జాదారుల కోరలు పీకడానికే ‘హైడ్రా’ (HYDRAA) ను తీసుకొచ్చానని చెప్పారు. హైడ్రాను చూసి భయపడాల్సిన అవసరం లేదని, సొంత స్థలాల్లో ఇళ్లు కట్టుకునే వారి జోలికి అది వెళ్లదని క్లారిటీ ఇచ్చారు. పార్కులు, నాలాలు, చెరువులు ఆక్రమిస్తే మాత్రం తొడలు తీస్తామని, వీపులు సున్నం అవుతాయని గట్టిగా హెచ్చరించారు. వనస్థలిపురంలో దేవుడి గుడి స్థలాన్ని కబ్జా చేస్తే హైడ్రా దాన్ని విడిపించిందని ఉదాహరణగా చెప్పారు.

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. హైదరాబాద్‌కు ఆ పరిస్థితి రావొద్దు

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోయి గాలి, నీరు విషంగా మారాయని, ముంబైలో వర్షం వస్తే 24 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఉందన్న సీఎం, బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ మనం హైదరాబాద్‌ను ఒక ‘విశ్వ నగరంగా’ మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. గతంలో పాలకులు హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ (దీని భూసేకరణలో దేవేందర్ గౌడ్ కృషి ఎంతో ఉంది), ఐటీ సంస్థలను తీసుకురావడం వల్లే హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. గతంలో సిరిస్ కంపెనీ వల్ల ఎల్బీనగర్ పరిధిలో నీరు కలుషితమై భూముల విలువలు పడిపోయాయని, దాన్ని వదిలించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందని గుర్తుచేశారు.

మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్‌ సిటీని అడ్డుకోవాలని చూస్తే వాతలు తప్పవు

మూసీ నది కాలుష్యం వల్ల నల్గొండ జిల్లా ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావని, అక్కడ పుట్టే బిడ్డల కాళ్లు వంకర్లు పోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “మూసీలో ఉన్న కాలుష్యం కంటే కల్వకుంట్ల వాళ్ల కడుపుల్లోనే ఎక్కువ కాలుష్యం ఉంది. నల్గొండ ప్రజలు ఎప్పుడూ ఆ మురికిలోనే బతకాలా?” అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, కోర్టుల్లో కేసులు వేసినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని.. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర అంతర్జాతీయ స్థాయిలో మూసీని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

అలాగే 30 వేల ఎక‌రాల్లో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ నిర్మిస్తుంటే కొందరు వద్దంటున్నారని, అక్కడ మళ్లీ ఫార్మా కంపెనీలే ఉండాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ వాళ్ల ఫ్యూచర్‌ను ప్రజలు ఎప్పుడో రద్దు చేశారని ఎద్దేవా చేసిన సీఎం.. “సిద్దిపేటలో మళ్లీ గెలిస్తే కదా ఆయన మాట్లాడేది” అంటూ సెటైర్లు వేశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 15 వేల ఎకరాల్లో అడవులను అభివృద్ధి చేస్తామని, అక్కడ 60 శాతం పచ్చదనం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తు తరాలు మాట్లాడుకునేలా, ఎవరు ఏడ్చినా సరే అంతర్జాతీయ కంపెనీలను తీసుకువచ్చి భారత్ ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.