
నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి పొన్నం. పరీక్షా రాసే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఏడాది నీట్ పరీక్ష కోసం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక మార్పులను ప్రకటించింది. ఎగ్జామ్ ను మరింత పారదర్శకంగా, సురక్షితంగా, విద్యార్థులకు అనుకూలంగా మార్చేందుకు ఎన్డీఏ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
►ALSO READ | రైతులకు శుభవార్త.. జూన్ 30న రైతు భరోసా నిధులు విడుదల
గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ ఈసారి ఎగ్జామ్ టైంను 195 నిమిషాలకు పెంచారు. ఎగ్జామ్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుంది. ఎగ్జామ్ ప్రారంభానికి ముందు అటెండెన్స్ డాక్యుమెంట్స్ పై సైన్ లు చేయడం, ఇన్విజిలేషన్ లాంఛనాలు పూర్తి చేయడం వంటి పరిపాలనాపరమైన పనుల వల్ల.. విద్యార్థులు తమకు కేటాయించిన రాత సమయాన్ని నష్టపోకూడదనే ఉద్దేశంతో ఎన్టీఏ ఈ అదనపు సమయాన్ని కేటాయించింది.
దీనివల్ల అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయడంపైనే పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. ఎగ్జామ్ రోజున విద్యార్థులకు పూర్తి స్పష్టత, సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ కొత్త నిబంధనలను అభ్యర్థులందరూ గమనించాలని ఎన్టీఏ స్పష్టం చేసింది.