Reading Time: 2 minutes

లీగల్ చిక్కుల్లో కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ .. అసలేం జరిగిందంటే?

Caption of Image.

సినిమా ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు కొత్తేమీ కాదు. కానీ ఒక సినిమా టీజర్ రిలీజైన కొన్ని రోజులకే లీగల్ చిక్కుల్లో పడటం అంటే అది ఖచ్చితంగా సెన్సేషనే. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, టాలెంటెడ్ యాక్టర్ శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ (The India Story: Slow Poison In Progress).  అయితే జూలై 24, 2026న గ్రాండ్‌గా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమాకు.. విడుదలకు ముందే లీగల్ చిక్కులు రావడం చర్చనీయాంశంగా మారింది..

అసలేం జరిగిందంటే..?

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ లో కంటెంట్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. భారతదేశంలో వ్యవసాయం, డైరీ, పౌల్ట్రీ రంగాల వెనుక జరుగుతున్న చీకటి కోణాలను చూపిస్తున్నామంటూ మేకర్స్ చేసిన ప్రయత్నం ఇప్పుడు రివర్స్ అయింది. ఇండియాలో వ్యవసాయ రంగాన్ని తప్పుగా, కించపరిచేలా చూపించారంటూ ఈ చిత్ర బృందానికి ఊహించని షాక్ తగిలింది. జూన్ 15న అగ్రి బిజినెస్ సెంటర్ అధినేత భవేష్ సోధా తరఫున లాయర్ హిరణ్య పాండే.. జీ స్టూడియోస్, ఎమ్ఐజి ప్రొడక్షన్స్తో పాటు సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు.

‘స్లో పాయిజన్’ వివాదం..

మన దేశ వ్యవసాయ పద్ధతులు, ఆహార ఉత్పత్తి రంగాలు ప్రజలకు స్లో పాయిజన్ ఇస్తున్నట్లు సినిమాలో చూపించడాన్ని భవేష్ సోధా తీవ్రంగా తప్పుపట్టారు. పురుగుమందుల వాడకం, ఆహార కల్తీ వల్లే దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయంటూ సినిమాలో చూపించిన సీన్స్ శాస్త్రీయంగా నిరూపితం కాలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో హెక్టారుకు వాడే పురుగుమందుల శాతం చాలా తక్కువని, అలాగే చనిపోయిన కోడికి ఇంజెక్షన్ ఇస్తున్నట్లు చూపించిన విజువల్స్ పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సినిమా వల్ల దేశంలోని లక్షలాది మంది రైతులు, డైరీ, పౌల్ట్రీ వ్యాపారుల ప్రతిష్ట దెబ్బతింటుందని భవేష్ సోదా ఆగ్రహం వ్యక్తం చేశారు.  వెంటనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్ నుండి ఆ టీజర్‌ను తొలగించి, సినిమాలో మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, సినిమాలో చూపించిన గణాంకాలకు సైంటిఫిక్ ప్రూఫ్స్ ఏంటో చూపించాలని మేకర్స్‌కు సవాల్ విసిరారు.

ALSO READ : కల్కి 2కు ముందే నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. 

థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చేనా?

చేతన్ డికె దర్శకత్వంలో, సాగర్ బి. షిండే కథ-నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదొక ఇంటెన్స్ సోషల్ థ్రిల్లర్ అని, సమాజంలో కళ్ళు తెరిపించే నిజాలను చూపించబోతున్నామని చిత్ర యూనిట్ భావిస్తుంటే.. మరోవైపు లీగల్ నోటీసులు సినిమాకు పెద్ద బ్రేక్ వేసేలా ఉన్నాయి. మరి ఈ కాంట్రవర్సీపై కాజల్ అగర్వాల్ టీమ్ ఎలా స్పందిస్తుందో? జూలై 24న థియేటర్లలో ఈ స్లో పాయిజన్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి…

 

©️ VIL Media Pvt Ltd.