Reading Time: 2 minutes
Suriyas Viswanath And Sons First Single Buzz Fun Promo Video Goes Viral Before Song Release

Viswanath and Sons : ఒక సినిమాకు మంచి బజ్ క్రియేట్ కావాలంటే ఇప్పుడు ట్రైలర్ మాత్రమే సరిపోదు, దానికి ముందు వచ్చే అనౌన్స్‌మెంట్ కూడా కీలకంగా మారిపోతోంది ఈ రోజుల్లో. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కొత్త తరహా ప్రమోషన్ తప్పనిసరిగా మారింది. ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడి తన సినిమాల కోసం రూపొందించిన క్రియేటివ్ అనౌన్స్‌మెంట్ వీడియోలు మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహా మార్కెటింగ్ స్ట్రాటజీని దర్శకుడు వెంకీ అట్లూరి కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. హీరో సూర్య నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను ప్రకటించేందుకు చిత్రబృందం ఎంచుకున్న విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ వీడియోలో హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కనిపించకపోయినా, హీరోయిన్ మమితా బైజు, సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ తమ సరదా నటనతో ఆకట్టుకున్నారు. అనౌన్స్‌మెంట్‌కు బదులుగా ఒక చిన్న ఫన్నీ స్కిట్ రూపంలో ఈ వీడియోను రూపొందించారు. సినిమాలోని మొదటి పాట కోసం ఇంకా సింగర్ ఫైనల్ కాలేదని టెన్షన్ పడుతున్నట్లు జి.వి. ప్రకాష్ కనిపిస్తాడు. అదే సమయంలో దర్శకుడు వెంకీ అట్లూరి ఫోన్ చేసి వెంటనే సింగర్‌ను పంపిస్తున్నానని చెప్పడం, రీల్స్ షూట్ చేయడానికి స్టూడియోకు వచ్చిన మమితా బైజునే సింగర్‌గా భావించి జి.వి. ప్రకాష్ చేసిన మిస్ అండర్‌స్టాండింగ్ మొత్తం వీడియోకు మంచి బజ్ తీసుకొచ్చింది.

అయితే వీడియో పూర్తిగా తమిళ భాషలో ఉన్నప్పటికీ, మమితా బైజుకు సోషల్ మీడియాలో ఉన్న భారీ ఫాలోయింగ్ కారణంగా ఈ వీడియో ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ను దాటేసింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. ప్రేక్షకులను నవ్విస్తూ సినిమాపై ఆసక్తిని పెంచడంలో ఈ ప్రమోషనల్ వీడియో పూర్తిగా సక్సెస్ అయిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదే ఊపులో ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ప్రోమో కూడా మంచి స్పందన అందుకుంటోంది. ‘రఫ్ అయినా నువ్వు… టఫ్ అయినా నేను… మిక్స్ అయ్యే కాలం వచ్చిందిలే…’ అంటూ ప్రారంభమయ్యే ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాటకు ప్రముఖ గేయరచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, ఇటీవలి కాలంలో వరుస హిట్ పాటలతో ఆకట్టుకుంటున్న గాయని సుబ్లాషిని ఆలపించారు. ఇటీవల ‘కూలి’ చిత్రంలోని ‘మోనికా బెల్లూచి’ పాటతో పాటు ‘గోల్డెన్ స్పారో’, ‘కిస్సిక్’ వంటి వైరల్ హిట్ సాంగ్స్ పాడిన సుబ్లాషిని మరోసారి తన గాత్రంతో మ్యాజిక్ చేయనున్నారని సంగీతాభిమానులు భావిస్తున్నారు.

‘నేనో బటర్‌ఫ్లై…’ అంటూ సాగే ఈ పూర్తి లిరికల్ వీడియో సాంగ్ జూన్ 19న విడుదల కానుంది. పాట విడుదలకు ముందే ఇంత క్రేజ్ రావడంతో, ఇది కూడా సోషల్ మీడియాలో రీల్స్ ఫేవరెట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జెన్ జీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ మెలోడీ విడుదల తర్వాత మరింత వైరల్ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక సినిమా విషయానికి వస్తే, దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. రిలీజ్‌కు ముందే ప్రమోషన్లతో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.