
IPL 2027 : ఐపీఎల్ 2026 సీజన్ విజయవంతంగా ముగిసిన కొన్ని రోజులకే.. తదుపరి సీజన్ అయిన ఐపీఎల్ 2027 గురించి క్రికెట్ సర్కిల్స్లో రకరకాల వార్తలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా వచ్చే సీజన్ నుంచి మ్యాచ్ల సంఖ్య భారీగా పెరుగుతుందని, పాత పద్ధతిలో కాకుండా ఏకంగా 94 మ్యాచ్లు నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. ఈ ఊహాగానాలకు బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా బ్రేక్ వేశారు. పిటిఐ వార్తా సంస్థతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఐపీఎల్ 2027 లో ఎలాంటి మ్యాచ్ల పెంపు ఉండబోదని, గతంలో లాగే కేవలం 74 మ్యాచ్లు మాత్రమే జరుగుతాయని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు.
మ్యాచ్లు పెంచకపోవడానికి అసలు కారణం
మ్యాచ్ల సంఖ్యను 74 నుంచి 94కి పెంచకపోవడం వెనుక ఒక బలమైన కారణం ఉందని దేవ్జిత్ సైకియా వివరించారు. అంతర్జాతీయ క్రికెట్లో విదేశీ ఆటగాళ్ల ద్వైపాక్షిక సిరీస్ల షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ల సంఖ్యను పెంచితే, టోర్నమెంట్ కాలపరిమితి కూడా పెరుగుతుంది. దీనివల్ల విదేశీ ప్లేయర్లు తమ జాతీయ జట్లకు అందుబాటులో ఉండటం కష్టమవుతుంది. అన్ని దేశాల క్రికెట్ బోర్డులతో సత్సంబంధాలు కాపాడుకుంటూ, ఐపీఎల్ క్రేజ్ తగ్గకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మ్యాచ్ల సంఖ్యను పెంచకూడదని బీసీసీఐ నిర్ణయించుకుంది.
VIDEO | BCCI secretary Devajit Saikia says IPL could start as early as March 10 and finish by May 15 from next season to avoid adverse weather during the business end of the tournament. No plans, however, to expand the IPL beyond its current 74 matches due to international… pic.twitter.com/zxjHJoGWE4
— Press Trust of India (@PTI_News) June 18, 2026
వచ్చే సీజన్ షెడ్యూల్లో విప్లవాత్మక మార్పులు
మ్యాచ్ల సంఖ్య పెరగనప్పటికీ.. ఐపీఎల్ 2027 ప్రారంభ తేదీలలో మాత్రం బీసీసీఐ భారీ మార్పులు చేయబోతోంది. ఈ ఏడాది అంటే ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభమై మే 31 వరకు కొనసాగింది. అయితే వచ్చే ఏడాది టోర్నమెంట్ను దాదాపు రెండు వారాల ముందే, అంటే మార్చి మధ్యలోనే ప్రారంభించాలని బోర్డు గంభీరంగా ఆలోచిస్తోంది. మే నెల చివరి వారాల్లో దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఎండ తీవ్రత, రుతుపవనాల ముందస్తు రాకను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు.
ప్లేయర్స్, ఫ్యాన్స్ సౌకర్యం కోసమే ఈ నిర్ణయం
ఈ షెడ్యూల్ మార్పుల వెనుక ఉన్న అంతరార్థాన్ని బీసీసీఐ కార్యదర్శి క్లియర్ గా వివరించారు. “ఈ ఏడాది మే 15 తర్వాత దేశంలోని పలు ప్రాంతాలలో ప్రీ-మాన్సూన్ వర్షాలు కురిశాయి. దీనివల్ల కొన్ని మ్యాచ్లకు ఆటంకం కలిగే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా మే నెలలో ఎండ తీవ్రత అత్యధికంగా ఉండటం వల్ల మైదానంలో ఆడే ఆటగాళ్లతో పాటు, స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు కూడా ఎంతో ఇబ్బందికరంగా మారింది. అందుకే క్రీడాకారుల ఆరోగ్యం, అభిమానుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టోర్నీని కొంచెం ముందే ప్రారంభించి.. మే నెల మధ్యకల్లా పూర్తి చేసేలా కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నాం” అని దేవ్జిత్ సైకియా పేర్కొన్నారు. ఈ కొత్త మార్పుల వల్ల వచ్చే సీజన్ మరింత ఉత్సాహంగా సాగే అవకాశం ఉంది.