Reading Time: 2 minutes
Calcutta High Court Refuses Stay On Ritabrata Banerjee As Opposition Leader Setback For Mamata Banerjee

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ స్పీకర్ రథిన్ బసు తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ప్రస్తుతం రితబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం అమల్లోనే ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ కేసును విచారించిన జస్టిస్ కృష్ణారావు తదుపరి విచారణను జూలై 28కు వాయిదా వేశారు. అప్పటిలోగా అన్ని పక్షాలు తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించారు. చివరిగా ఉత్తర్వులు జారీ చేయడానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలు, అనుకూల పరిస్థితులు కనిపించలేదని పేర్కొంటూ కోర్టు పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా భావించే టీఎంసీ ఎమ్మెల్యే షోవన్‌దేబ్ చటోపాధ్యాయ్ ఈ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేశారు. రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించిన స్పీకర్ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆయన కోరారు. అయితే కోర్టు ప్రస్తుతం ఆ అభ్యర్థనను అంగీకరించలేదు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఎదురైన ఘోర పరాజయం తర్వాత పార్టీ శాసనసభ పక్షంలో విభేదాలు తలెత్తాయి. పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బాట పట్టారు. పార్టీ నాయకత్వం షోవన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను శాసనసభ పక్ష నేతగా ప్రతిపాదించినప్పటికీ.. ఆ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ రితబ్రత బెనర్జీ 58 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్నారు. అనంతరం ఆయన ప్రతిపక్ష నేత పదవిని దక్కించుకున్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో జూన్ 1న టీఎంసీ అధిష్ఠానం రితబ్రత బెనర్జీని పార్టీ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు కొనసాగడంతో రాజకీయ పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఈ కేసు విచారణ సందర్భంగా స్పీకర్ వ్యవహారశైలిపై కూడా హైకోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. మే 9న షోవన్‌దేబ్ చటోపాధ్యాయ్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని వచ్చిన లేఖపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టు గమనించింది.

అయితే జూన్ 3న తిరుగుబాటు వర్గం పంపిన లేఖను వెంటనే పరిగణనలోకి తీసుకుని రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నేతగా గుర్తించడంపై వివరణ ఎందుకు ఇవ్వలేదని స్పీకర్‌ను ప్రశ్నించింది. మొదటి వినతిపత్రాన్ని పక్కనపెట్టి రెండో లేఖపై తక్షణమే చర్యలు తీసుకోవడానికి గల కారణాలను స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టు తాజా నిర్ణయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారడంతో.. జూలై 28న జరగనున్న తదుపరి విచారణపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.