
Rohit Sharma Garden Dialogue Goes Viral: భారత క్రికెట్ జట్టు సారథి, హిట్మ్యాన్ రోహిత్ శర్మ త్వరలో బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు. మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే రోహిత్.. ఇప్పుడు సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఒక టెలివిజన్ షో ద్వారా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. తాజాగా ‘సోనీ పిక్చర్స్’ హిట్మ్యాన్ షోకు సంబంధించిన టీజర్ను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘బిగ్ ఎంటర్టైన్మెంట్ డెబ్యూకు సిద్ధమా’ అంటూ సోనీ టీవీ టీజర్ను పంచుకుంది. మరోవైపు రోహిత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేస్తూ.. ‘గార్డెన్ పని చాలు.. ఇప్పుడు కొత్తగా ఏదైనా చేద్దాం’ అని క్యాప్షన్ ఇచ్చాడు.
2024లో ఒక టెస్ట్ సిరీస్ సందర్భంగా మైదానంలో ప్లేయర్స్ అటూ ఇటూ తిరుగుతుంటే.. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ అసహనంతో ‘గార్డెన్లో ఎవరూ తిరగకూడదు’ అని మందలించాడు. ఇప్పుడు టీజర్ అంతా రోహిత్ నోట వచ్చిన ఆ పాపులర్ డైలాగ్ చుట్టూ తిరుగుతుంది. వీడియోలో అభిమానులు రోహిత్ దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడుగుతూనే.. ఆ గార్డెన్ డైలాగ్ చెప్పమని కోరతారు. దాంతో హిట్మ్యాన్ అసహనానికి గురవుతాడు. కాల్ చేసి నా జీవితంలో గార్డెన్ ఉండకూడదు అని చెబుతాడు. ఆపై మరో అభిమాని వచ్చి గల్లీ క్రికెట్ గురించి అడగ్గా.. ఓ చిన్న బ్యాట్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
వీడియో చివర్లో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘నేను చెప్పిన రెండు లైన్లే ఇంత వైరల్ అయితే.. నా మొత్తం షో రిలీజ్ అయ్యాక ఇంకెంత రచ్చ అవుతుందో ఊహించండి’ అనడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ టీజర్ చూసిన అభిమానులు రోహిత్ కామెడీ టైమింగ్కు ఫిదా అవుతున్నారు. ‘బ్లాక్ బస్టర్ లోడింగ్’ అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అయితే ఇది ఒక టాక్ షోనా?, కామెడీ షోనా? లేదా ఏదైనా రియాలిటీ గేమ్ షోనా? అనే విషయంపై సోనీ టీవీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ డెబ్యూ అని పేర్కొనడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. షో వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం రోహిత్ ఐపీఎల్ 2026లో ఆడుతున్న విషయం తెలిసిందే.