Reading Time: < 1 minute
Virat Kohli London Meeting Jordan Cox Secret Photo Goes Viral Before England Odi Series

Virat Kohli: ఇంగ్లాండ్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ ద్వారా భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి, ఆ సీజన్లో 600కు పైగా పరుగులు సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. జూలై 14న బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది.

ఈ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు, ఇంగ్లాండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్.. విరాట్ కోహ్లీతో లండన్‌లో జరిగిన తన భేటీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ జట్టులో కోహ్లీతో కలిసి ఆడిన కాక్స్.. గత నెల లండన్‌లో అతడిని కలిశాడు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఓ ఫోటో అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ లండన్ మీటింగ్ గురించి కాక్స్ ఇటీవల మాట్లాడుతూ.. తామిద్దరం ఆ భేటీని ఎవరికీ తెలియకుండా చాలా సీక్రెట్‌గా ఉంచాలని ప్రయత్నించినప్పటికీ, ఎవరో దొంగచాటుగా ఫోటోలు తీసి వైరల్ చేయడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నాడు. “విరాట్‌కి తెలియకుండానే కొందరు వ్యక్తులు అతడిని ఫాలో అవ్వడం నిజంగా బాధాకరం. మేము లండన్ వీధిలో కూర్చున్నప్పుడు వందలాది మంది మా పక్కనుంచే నడిచి వెళ్లారు, ఎవరూ ఆగలేదు, ఏమీ చేయలేదు. కానీ, ఆ తర్వాత రెండు గంటలకే కోహ్లీ నాకు మెసేజ్ చేస్తూ.. ‘ఈ ఫోటోలు చూశావా?’ అని అడిగాడు. అది చూసి నేను షాక్ అయ్యాను. అసలు ఇదెలా సాధ్యమైంది అనుకున్నాను” అని కాక్స్ ‘ది గార్డియన్’ పత్రికతో పేర్కొన్నాడు. కోహ్లీపై అభిమానులకు ఉన్న క్రేజ్ గురించి చెబుతూ.. విరాట్ కోహ్లీ అందరిలాగే చాలా సాధారణ జీవితాన్ని గడపాలని, ఎంజాయ్ చేయాలని కోరుకుంటాడు. కానీ, దురదృష్టవశాత్తూ అతనికి అది ఎప్పుడూ సాధ్యపడదన్నాడు.