
Terror Attack: ఆఫ్రికా దేశం మాలిలో భారీ ఉగ్రవాద దాడి జరిగింది. అల్ ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థలు, లువారెగ్ తిరుగుబాటుదారులు దేశంలోని పలు ప్రాంతాలపై ఒకేసారి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో దేశ రక్షణ మంత్రి సాడియో కామారా మరణించారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల సంవత్సరాల్లో జరిగిన భారీ ఉగ్రదాడిగా పేర్కొంటున్నారు.
Read Also: LSG vs KKR: టాస్ గెలిచిన లక్నో.. ప్రతీకారం తీర్చుకునేందుకు సై..
మాలి రక్షణ మంత్రి సాడియో కామారా నివసించే కాటి సైనిక స్థావరంపై జెఎన్ఐఎం మిలిటెంట్లు దాడి చేశారని ఫ్రెంచ్ రేడియో స్టేషన్ ఆర్ఎఫ్ఐ నివేదించింది . ఆయన ఇంటిపై దాడి జరగగా మరణించినట్లు వెల్లడించింది. శనివారం మొదలైన దాడులు ఆదివారం కూడా కొనసాగాయి. రాజధాని బమాకోలోని ఒక సైనిక స్థావరం వద్ద కూడా దాడి జరిగింది. మాలిలో ఉత్తరాన ఉన్న కిడాల్ నగరంలో చాలా కాలంగా ప్రభుత్వం, తిరుగుబాటుదారులకు పోరాటం జరుగుతోంది. అయితే, తాజా దాడుల తర్వాత ప్రభుత్వం నుంచి ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు.
ఈ దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడుల్లో మరణాల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇన్నాళ్లు మారుమూల గ్రామాలను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులు, ఈసారి ఏకంగా రాజధాని బమాకోలోని సైనిక స్థావరాన్ని కూడా టార్గెట్ చేశారు. రక్షణ మంత్రిని దాడిలో చంపేశారు. ఒకేసారి పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు. మాలిలో ప్రస్తుతం సైనిక ప్రభుత్వం ఉంది. మరోవైపు అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ జేఎన్ఐఎం, ఉత్తర మాలిలో తమ సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని టువారెగ్ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు.