
Rice Vadiyalu: సాధారణంగా చాలా మంది రాత్రి పూట అన్నం మిగిలిపోతే పడేయడం చేస్తుంటారు. కానీ ఆ మిగిలిన అన్నంతో ఎంతో రుచికరమైన, కరకరలాడే వడియాలను తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా. సింపుల్గా రాత్రి అన్నంతో అదిరిపోయే రైస్ పాపడ్స్ను ఎలా తయారు చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Kaleshwaram Commission : కాళేశ్వరం కమిషన్పై రేపు హైకోర్టు తీర్పు..
తయారీ విధానం ఇదే:
ముందుగా మిగిలిన అన్నాన్ని మిక్సీలో వేసి, తగినంత నీరు పోసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీటిని పోసి, అందులో రుచికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా మరగబెట్టాలి. అనంతరం నీళ్లు మరుగుతున్నప్పుడు, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం పేస్ట్ను అందులో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ పది నిమిషాల పాటు ఉడికించాలి. ఈ మిశ్రమం చిక్కబడ్డాక స్టవ్ ఆపేయాలి.
తర్వాత ఉడికిన ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బట్టపై చిన్నచిన్న వడియాలుగా వేసుకోవాలి. వీటిని రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి. వడియాలు పూర్తిగా ఎండిన తర్వాత, వేడి నూనెలో వేయిస్తే తెల్లగా, కరకరలాడుతూ వస్తాయి. ఇలా చేస్తే ఆహారాన్ని వృథా చేయకుండా, ఇంట్లోనే ఎంతో శుభ్రంగా, రుచికరమైన వడియాలను తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో సులభంగా చేసుకునే ఈ ‘రైస్ పాపడ్స్’ భోజనంలోకి నంజుకోవడానికి ఎంతో బాగుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం కుదిరితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
READ ALSO: Nestle India: నెస్ట్లే ఇండియా ‘లాభాల’ మేజిక్.. ఇన్వెస్టర్లకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా?