
ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ప్రస్తుతం పాకిస్థాన్ తీరు మాత్రం అలా ఉంది. ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగొచ్చన్న కారణంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ప్రభుత్వం పూర్తి బందోబస్త్ ఏర్పాటు చేసింది. పూర్తిగా లాక్డౌన్ విధించింది. ప్రజలెవరూ బయటకు రాకుండా ఆంక్షలు విధించింది. ప్రధాన రహదారులన్నీ మూసేశారు. ఇస్లామాబాద్ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది. పోలీసులు, భద్రతా దళాల మోహరింపుతో నగరమంతా వెలవెలబోతుంది.

ప్రముఖ హోటళ్ల దగ్గర హెలికాప్టర్లతో గస్తీ నిర్వహిస్తున్నాయి. ఫైవ్ స్టార్ హోటళ్లు చుట్టూ భద్రతా దళాలు మోహరించాయి. అయితే రెండు దేశాల మధ్య చర్చలు ఉంటాయా? లేదా? అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కానీ పాకిస్థాన్ మాత్రం పూర్తి సన్నద్ధంగా ఉంది.
తొలి విడత చర్చలు 21 గంటల పాటు జరిగాయి. చివరికి విఫలం కావడంతో ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. రెండో విడత చర్చలు మంగళవారం జరగాల్సి ఉండగా ఇప్పటి వరకు ఇరాన్, అమెరికా బృందాలు ఇస్లామాబాద్కు చేరుకోలేదు. దీంతో చర్చలపై పూర్తి సందిగ్ధం నెలకొంది. అయితే రెండు దేశాలు చర్చలకు రావొచ్చని పాకిస్థాన్ మీడియా మాత్రం పేర్కొంది. ఇక ఇరాన్-అమెరికా మధ్య జరిగిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం రేపటితో ముగుస్తోంది.