July 10, 2026

UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్

UN-India: ఆప్ఘనిస్థాన్‌లో పాక్ దాడులు అన్యాయం.. ఖండించిన భారత్
Reading Time: < 1 minute
India Condemns Pakistan Airstrikes Afghanistan Un Speech

ఆప్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ వైమానిక దాడులను భారత్ ఖండించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ మధ్య జరిగిన సంఘర్షణలను గురించి ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు.

ఆప్ఘనిస్థాన్‌పై వైమానిక దాడులను భారత్‌ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఇవి అంతర్జాతీయ చట్టాలతో పాటు ఆ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని పలు దేశాలు కోరాయని.. అయినప్పటికీ పాక్‌- అప్ఘనిస్థాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయని తెలిపారు. సరిహద్దుల్లో జరిగే ఘర్షణలు కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. అంతర్జాతీయ మానవతా వాదం, అంతర్జాతీయ చట్టాలను బాధ్యతాయుతంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

కాబూల్‌లోని తాలిబన్ ప్రభుత్వం టీటీపీకి ఆశ్రయం కల్పిస్తోందని పాకిస్థాన్ పదే పదే ఆరోపిస్తోంది. ఆఫ్ఘన్ అధికారులు ఈ ఆరోపణను ఖండిస్తున్నారు. ఆగస్టు 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్ లోపల టీటీపీ దాడులను ముమ్మరం చేసింది.

ఇది కూడా చదవండి: War Effects: ముంబై, చెన్నైలో గ్యాస్ సంక్షోభం.. మూతపడ్డ పలు హోటల్స్