Reading Time: < 1 minute
India Vs South Africa 5th T20i India Win Series 3 1

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసి భారీ స్కోరు నమోదు చేసింది. తిలక్ వర్మ 42 బంతుల్లో 73 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, హార్దిక్ పాండ్యా 25 బంతుల్లో 63 పరుగులతో విధ్వంసకర ఆటతీరును కనబరిచాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (34), సంజూ శాంసన్ (37) కూడా జట్టుకు శుభారంభం అందించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు క్వింటన్ డి కాక్ (65) దూకుడుగా ఆడినా, అతను ఔటైన తర్వాత జట్టు క్రమంగా వెనుకబడింది. వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లతో కీలక పాత్ర పోషించగా, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ కూడా కీలక సమయంలో వికెట్లు తీశారు. చివరకు సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుని, స్వదేశంలో తన అజేయ సిరీస్ రికార్డును 18కి పెంచుకుంది.