Reading Time: 2 minutes
India 80th Independence Day 2026 World Leaders Greetings

Independence Day: భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు శుభాకాంక్షలు చెప్పాయి. అమెరికా, ఇజ్రాయిల్, రష్యా, నేపాల్, సింగపూర్, భూటాన్, మాల్దీవులు, ఆస్ట్రేలియా దేశాధినేతలు భారత ప్రజలకు సందేశాలు పంపారు. భారత్‌తో తమ దేశాల సంబంధాలను బలోపేతం చేసుకోవడం, సహకారాన్ని పెంపొందించుకోవడం, స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడారు.

అమెరికా:

అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాల కారణంగా భారత్-అమెరికా సంబంధాలు నిరంతరం బలపడుతున్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం, బలమైన, దూరదృష్టి గల భాగస్వామ్యానికి పునాది అని ఆయన అన్నారు. రక్షణ, ఇంధన భద్రత, కీలక ఖనిజాలు, కృత్రిమ మేధస్సు, అంతరిక్ష సహకారం మరియు వాణిజ్యం వంటి రంగాలలో రెండు దేశాల మధ్య సహకారం పెరుగుతోందని ఆయన తెలిపారు.

ఇజ్రాయిల్:

ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రజలకు వారి 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇజ్రాయెల్, భారతదేశం మధ్య ఉన్న అందమైన స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా భారతదేశానికి తమ శుభాకాంక్షలను తెలియజేసింది.

రష్యా:

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీలకు అభినందనలు తెలియజేశారు. భారత్ ఆర్థిక, సామాజిక, శాస్త్రీయ, సాంకేతిక రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తోందని అన్నారు. రష్యా-భారత్ సంబంధాలు ఒక ప్రత్యేకమైన మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్య స్ఫూర్తితో విజయవంతంగా పురోగమిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

నేపాల్:

నేపాల్ ప్రధాని బాలెన్ షా, భారత ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీకి, భారత ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్, భారత్ మధ్య ఉన్న చారిత్రక, నాగరిక సంబంధాలు, సన్నిహిత ప్రజల సంబంధాలు సహకారాన్ని గుర్తుచేశారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు.

సింగపూర్:

సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, అధ్యక్షుడు ముర్ముకు మరియు భారత ప్రజలకు అభినందనలు తెలిపారు. శాంతియుత, స్వేచ్ఛాయుత, అనుసంధానిత ప్రాంతం పట్ల భారత్, సింగపూర్ రెండింటికీ శాశ్వత ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, ఇంధన పరివర్తనతో సహా పలు రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

భూటాన్:

భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, భూటాన్‌ల మధ్య శాశ్వత స్నేహం, సన్నిహిత సంబంధాలు మరింతగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

మాల్దీవులు:

1947 నుంచి భారత్, మాల్దీవుల మధ్య పర్యటనలు, మాల్దీవుల వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు స్పూర్తిగా నిలిచాయని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహమ్మద్ సోలిహ్ అన్నారు. భారతదేశం, మాల్దీవుల మధ్య ఉన్న సన్నిహిత సహకార, స్నేహ సంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా:

ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ కూడా భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఎనిమిది దశాబ్దాలుగా భారతదేశం స్థిరంగా అభివృద్ధి చెందిందని, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన విజయాలు, సామర్థ్యంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటోందని ఆయన అన్నారు.