Reading Time: < 1 minute
Omar Abdullah Pok Jammu Kashmir Special Status 2019 Statement

Omar Abdullah:  జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జమ్మూ కాశ్మీర్ పరిస్థితి మారకుంటే , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ప్రజలు కూడా భారత్‌లో తిరిగి కలవాలని కోరుతూ ఈ రోజు వీధుల్లో నిరసన చేసేవారని అన్నారు. శ్రీనగర్‌లోని బక్షీ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరసనలు చేపట్టిన ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొందరు గాయపడటం, అరెస్టు కావడం తనను బాధించిందని తెలిపారు.

1947లో పాకిస్తాన్ నుంచి వచ్చిన గిరిజన ఆక్రమనదారుల దాడుల్ని ఎదురించి భారత్‌లో విలీనం కావాలని నిర్ణయించుకున్న కాశ్మీరీల నిర్ణయం సరైనదే అని నేడు పీఓకే పరిస్థితిని చూస్తే అర్థమవుతోందని అన్నారు. ఆ సమయంలో భారత్ సైన్యం కాశ్మీర్ చేరుకునే ముందే స్థానికులు ఆక్రమణదారులపై దాడికి సిద్ధమయ్యారని అన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీఓకే ప్రాంతానికి సంబంధించిన కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయని, ఏదో రోజు ఆ ప్రాంతం కూడా భారత్‌లో కలుస్తుందనే ఆశ ఉందని అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన హామీల పునరుద్ధరణ కోసం తన ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తుందని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

2019లో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది. ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు జమ్మూ కాశ్మీర్‌ను లడఖ్, జమ్మూకాశ్మీర్‌గా విభజించింది. అయితే, ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రతిపక్ష నేత సునీల్ శర్మ విమర్శించారు. సీఎం వ్యాఖ్యలు బాధ్యతారహితమైందిగా పేర్కొన్నారు.