
తెలంగాణ వైపు ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాలు చూస్తున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పారు.,
సంగారెడ్డి సభలో మాట్లాడిన ఆయన.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా… ఇరవై నాలుగు గంటల కరెంట్ తో పాటు, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత మన తెలంగాణదేనన్నారు. అంతేకాదు, రైతులకు అండగా నిలుస్తూ సన్న వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని మంత్రి స్పష్టం చేశారు.
విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా 120 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో పాటు, ప్రతి నియోజకవర్గంలో రెండు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
యువత ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. ఇచ్చిన మాట ప్రకారం… రెండేళ్లలో 2 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగా ఇప్పటికే లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. యువతను నైపుణ్యాభివృద్ధిలో తీర్చిదిద్దేందుకు 120 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను (ATCs) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
కేవలం స్థానికంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలోనూ మన యువత రాణించేలా చర్యలు చేపట్టారు. టామ్ కామ్ (TOMCOM) ద్వారా విదేశీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ… ఇటలీ, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో డిమాండ్ ఉన్న ఆయా విదేశీ భాషలను ప్రభుత్వమే స్వయంగా నేర్పిస్తోందన్నారు వివేక్.