Reading Time: 2 minutes
IPL 2027  : ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.. ముంబై, రాజస్థాన్ మధ్య నడుస్తున్న భారీ సీక్రెట్ డీల్ ఇదేనా?

IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల బదిలీకి సంబంధించిన వార్తలు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఒక భారీ ట్రేడింగ్ డీల్ నడుస్తోంది. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, దానికి బదులుగా రాజస్థాన్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ముంబై ఇండియన్స్‌లోకి తెచ్చుకునేందుకు చర్చలు సాగుతున్నట్లు లీకులు వస్తున్నాయి.

గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి భారీ అంచనాలతో ముంబై ఇండియన్స్‌లో అడుగుపెట్టిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు ఐపీఎల్ 2026 సీజన్ ఏమాత్రం కలిసిరాలేదు. అతని కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ కనీసం ప్లేఆఫ్స్ దశకు కూడా చేరుకోలేక ఘోరంగా విఫలమైంది. అంతేకాకుండా, జట్టు లోపల హార్దిక్‌కు ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించలేదనే ప్రచారం కూడా గట్టిగా సాగింది. మేనేజ్‌మెంట్‌తో కూడా కొన్ని విభేదాలు రావడంతోనే హార్దిక్ తన కొత్త ల్యాండింగ్ స్పాట్ కోసం రాజస్థాన్ రాయల్స్ వైపు చూస్తున్నట్లు నివేదికలు చెప్తున్నాయి.

మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్ భవిష్యత్తులో ఆ జట్టుకు కెప్టెన్ అవుతాడని అందరూ భావించారు. కానీ, రాజస్థాన్ ఫ్రాంచైజీ అనూహ్యంగా రియాన్ పరాగ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. దీనికి తోడు జట్టులోకి వైభవ్ సూర్యవంశీ రూపంలో మరో విధ్వంసకర యంగ్ ఓపెనర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ పరిణామాల వల్ల రాజస్థాన్ జట్టులో తన ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన జైస్వాల్, ముంబై ఇండియన్స్ లాంటి పెద్ద ఫ్రాంచైజీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

కేవలం ముంబై, రాజస్థాన్ మాత్రమే కాకుండా ఐపీఎల్ 2027లో మరికొన్ని జట్లు కూడా రూపురేఖలు మార్చుకోనున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్‌ను వీడి రిషభ్ పంత్ మళ్లీ తన పాత టీమ్ అయిన ఢిల్లీ క్యాపిటల్స్ (DC)లోకి రీ-ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టుకు మారే అవకాశం ఉంది. ఈ మార్పులతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా రాబోతున్నాడని, టీమ్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ, బ్యాటింగ్ కోచ్‌గా లెజెండరీ ప్లేయర్ యువరాజ్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ భారీ మార్పులు గనుక నిజమైతే ఐపీఎల్ 2027 మరింత రసవత్తరంగా మారడం ఖాయం.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి