July 11, 2026

CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!

CM Chandrababu: మంత్రుల రివ్యూకు మినహాయింపు ఉండదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్!
Reading Time: 2 minutes
Cm Chandrababu Warns Ministers Officials Over Delay In File Clearance In Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారులు ఫైళ్లను గరిష్టంగా 24 గంటల్లో క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు రోజుల గడువును ఇకపై ఒక రోజుకు కుదించాలని సూచించారు. సచివాలయంలో ఫైళ్ల పెండింగ్, వాటి క్లియరెన్స్ సమయంపై నిర్వహించిన సమీక్షలో సీఎం అధికారుల పనితీరును విశ్లేషించారు. ఈ సందర్భంగా సీఎస్ విజయానంద్ స్థానంలో పనిచేస్తున్న సాయి ప్రసాద్.. 3870 ఫైళ్లను సగటున 10 గంటల్లో క్లియర్ చేసిన విషయాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

మిగతా అధికారులు కూడా సాయి ప్రసాద్ తరహాలో ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో వేగం పెంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. అయితే కొన్ని శాఖల కార్యదర్శుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. జయలక్ష్మి, బాలసుబ్రహ్మణ్యం, ఆమ్రపాలి సహా పలువురు అధికారులు ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి 5 నుంచి 6 రోజులు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై అలాంటి జాప్యాలు ఉండకూడదని, 24 గంటల్లోపు ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ల పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక్కో ఫైల్‌కు మూడు రోజులు తీసుకుంటుండగా.. ఆనంద్, అభిషిక్త్ కిషోర్, వెంకటేశ్వరన్ వంటి అధికారులు రెండు రోజుల సమయం తీసుకుంటున్నారని తెలిపారు. ఫైళ్ల పరిష్కారంలో మరింత వేగం అవసరమని సూచించారు. ఈ సందర్భంగా మన్యం జిల్లా కలెక్టర్‌కు సీఎం చురకలు అంటించారు. ‘ముస్తాబుపై చూపిస్తున్న ఆసక్తి ఫైళ్ల క్లియరెన్స్‌పై కూడా చూపాలి’ అంటూ ఫైర్ అయ్యారు. పరిపాలనలో వేగం పెరగాలంటే ఫైళ్ల క్లియరెన్స్ వ్యవస్థ సమర్థంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాధించాలంటే ఫైళ్ల పరిష్కారం వేగంగా జరగాల్సిందేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కొన్ని చోట్ల జాయింట్ కలెక్టర్లు ఒక్కో ఫైల్‌కు 5 నుంచి 6 రోజులు తీసుకుంటున్నారని, ఈ పరిస్థితి మారాలని అన్నారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఒక్కో ఫైల్ క్లియర్ చేయడానికి 10 రోజులు తీసుకుంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజా సేవల్లో ఆలస్యం తగ్గించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఇక మంత్రుల పనితీరుపై కూడా సీఎం చంద్రబాబు స్పందించారు. మినిస్టర్ల పనితీరు వివరాలను బహిరంగపరచడం మంచిది కాదని, దానిపై అనవసర రాజకీయ రాద్ధాంతం జరిగే అవకాశం ఉందన్నారు. అయితే మంత్రుల పనితీరు సమీక్ష మాత్రం తప్పనిసరిగా కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.