
ప్రముఖ ప్రవచనకర్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులు చాగంటి కోటేశ్వరరావు, భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ రోజు (ఏప్రిల్ 16, గురువారం) ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం చాగంటి కోటేశ్వరరావు ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ…. శ్రీమన్నారాయణుడు తన ఇచ్ఛాశక్తితో, భక్తుల కోసం ఈ తిరుమల కొండలపై శ్రీ వేంకటేశ్వరుడిగా వెలిశారని… చేతిలో సుదర్శన చక్రాన్ని ధరించిన ఆ స్వామి, తనను నమ్ముకున్న భక్తులను కంటికి రెప్పలా కాపాడుతూ నిరంతరం రక్షణ కల్పిస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్రిక్తతలు, అశాంతి నెలకొన్నప్పటికీ, మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామంటే అది ఆ శ్రీనివాసుడి కృప వల్లే సాధ్యమవుతోందని.. శ్రీవారిని దర్శించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలందరిపై వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చాగంటి కోటేశ్వరరావు గారు తెలిపారు.