
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎన్నికల ప్రచారంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మార్చి 27న ధేమాజీలో జరిగిన ప్రచారంలో ఒక మహిళా అభిమాని ముఖ్యమంత్రిని దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అభిమానం వెల్లువెత్తిన వేళ..
ధేమాజీతో పాటు లఖింపూర్, బిహ్పురియా ప్రాంతాల్లో కూడా ముఖ్యమంత్రికి మహిళా ఓటర్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. భారీగా తరలివచ్చిన మహిళలు భద్రతా వలయాలను దాటుకుని మరీ ఆయనను హత్తుకోవడం, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం, పూల వర్షం కురిపించడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. చాలా మంది మహిళలు భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోగా, మరికొందరు నవ్వుతూ ఆయనకు స్వాగతం పలికారు.
ముఖ్యమంత్రి స్పందన..
ఈ తోపులాటలో ముఖ్యమంత్రికి కొన్ని చిన్న గీతలు (గాయాలు) పడ్డాయి. అయితే దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. ఇవి కేవలం గీతలు కావని.. ప్రజలు తనపై చూపిస్తున్న ‘ప్రేమ, ఆశీర్వాదాలకు గుర్తులు’ అని ఆయన అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో తనకు ఉన్న అనుబంధానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
Also Read:Growth Risks: భారత ఆర్థిక వృద్ధికి పొంచి ఉన్న ముప్పు.. భారీగా తగ్గిన అంచనాలు..
రాజకీయ దుమారం..
మరోవైపు, ఈ వైరల్ వీడియోపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి ప్రవర్తన సరికాదని.. ఇది మర్యాదపూర్వకంగా లేదని వారు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తు్న్నారు. కొందరు ఇది స్వచ్ఛమైన అభిమానం అని అంటుంటే.. మరికొందరు దీనిని హద్దులు దాటడమని విమర్శిస్తున్నారు.
Assam: A lady in Dhemaji pulled and kissed CM @himantabiswa on his cheeks.
Meanwhile, if you notice, a little girl towards the end of the video, with folded hands greeting the Chief Minister.
Difference of age, understanding and upbringing.
pic.twitter.com/kUUM2PydZx
— aboyob bhuyan (@aboyobbhuyan) March 28, 2026
ఎన్నికల నేపథ్యంలో ప్రాధాన్యత..
ఏప్రిల్ 9న అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసోంలో మహిళా ఓటర్లు అత్యంత కీలకం. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అరుణోదయ్’, ‘లఖ్ పతి బైడియో’ వంటి పథకాలు మహిళల్లో ఈ స్థాయి ఆదరణకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భావోద్వేగపూరితమైన మద్దతు ఓట్ల రూపంలో మారుతుందో లేదో మే 4న వెలువడే ఫలితాల్లో తేలనుంది.
