
Russia : అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ప్రపంచంలోని ప్రధాన ఇంధన ఎగుమతి దేశాలలో ఒకటైన రష్యా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్యాసోలిన్ (పెట్రోల్) ఎగుమతులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ఇంధన మంత్రిత్వ శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పలు నివేదిక ప్రకారం.. ఈ నిషేధం కేవలం కొన్ని రోజులు మాత్రమే కాదు.. ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, అంటే దాదాపు నాలుగు నెలల పాటు అమల్లో ఉండనుంది. రష్యా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం కావచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: India Receives Good News Amid Conflict: యుద్ధం మధ్యలో భారత్కు శుభవార్త..
నిషేధానికి గల ప్రధాన కారణాలు ఇవే..
రష్యా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్లో నెలకొన్న అస్థిరతను అదుపు చేయడమే రష్యా ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తుంది. గత ఏడాది రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా, దేశీయ మార్కెట్లో సరఫరాను స్థిరీకరించాలని పుతిన్ సర్కార్ భావిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై ఉక్రెయిన్ దాడులు పెరిగాయి. ఈ ముప్పు దృష్ట్యా ఇంధన నిల్వలను దేశం దాటకుండా జాగ్రత్తపడుతోందని అంటున్నారు.
గత ఏడాది రష్యా సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ను ఎగుమతి చేసింది. అంటే రోజుకు దాదాపు 1.17 లక్షల బ్యారెళ్ల ఇంధనం అంతర్జాతీయ మార్కెట్కు సరఫరా అయ్యేది. ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో ఎగుమతులు నిలిచిపోవడంతో, రష్యాపై ఆధారపడిన దేశాల్లో ఇంధన ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ముడి చమురు శుద్ధి ప్రక్రియ యధావిధిగా కొనసాగుతుందని, దేశీయంగా మాత్రం ధరలు పెరగకుండా నియంత్రిస్తామని రష్యా ప్రభుత్వం హామీ ఇచ్చింది.
READ ALSO: Indigo Emergency: జస్ట్ మిస్.. ఢిల్లీ విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం