Reading Time: 2 minutes
CBSE 10, 12 Exams Postponed: ఇరాన్‌ ప్రతికార దాడుల ఎఫెక్ట్.. CBSE 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు మళ్లీ వాయిదా!

న్యూఢిల్లీ, మార్చి 3: ఇరాన్‌ లక్ష్యంగా.. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో CBSE బోర్డు పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ దళాల ప్రతీకార దాడులకు దారితీసింది. ఈ అస్థిర పరిస్థితుల కారణంగా విద్యార్థుల భద్రత గురించి తీవ్రమైన ఆందోళనల రేకెత్తించింది. దీంతో మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన సీబీఎస్సీ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసింది. మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన తర్వాత పరీక్షలకు సంబంధించిన అప్ డేట్స్ జారీ చేస్తామని బోర్డు తన అధికారిక ప్రకటనలో వివరించింది. విద్యార్థులు, పరీక్షా సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని, ప్రభావిత దేశాల్లోని విద్యార్థులందరికీ కొత్త పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని CBSE తెలిపింది.

కాగా మార్చి 3న జారీ చేసిన సర్క్యులర్-2 ప్రకారం బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాలలోని విద్యార్థుల పరీక్షలు వాయిదా వేసింది. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తారు. మార్చి 7 నుంచి జరగాల్సిన పరీక్షల వివరాలను మార్చి 5, 2026 (గురువారం) వెల్లడిస్తామని బోర్డు తెలిపింది. బాధిత దేశాల్లోని విద్యార్థులందరూ సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రకటనలను మాత్రమే అనుసరించాలని పరీక్షల కంట్రోలర్ డాక్టర్ సంయమ్ భరద్వాజ్ సూచించారు. ఈ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ ఉండేలా చూసేందుకు ఈ సర్క్యులర్‌ను ఆయా దేశాల్లోని భారత రాయబారులు, దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్‌కు జారీ చేశారు. కాగా CBSE మార్చి 2న జరగాల్సిన 10, 12 తరగతుల బోర్డు పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తామని పేర్కొంది. మార్చి 3న పరిస్థితిని మరోసారి సమీక్షించి మార్చి 5 నుంచి జరగాల్సిన పరీక్షలను బోర్డు వాయిదా వేసింది.

ఇరాన్ సుప్రీం నేత హత్య ప్రతీకార దాడులకు కారణం ఇదే..

గత శనివారం మధ్యాహ్నం అమెరికా, ఇజ్రాయెల్.. టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు లక్ష్యంగా క్షిపణులు (వన్-వే అటాక్) డ్రోన్‌లతో దాడి చేశాయి. ఇందులో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ కాంపౌండ్‌ కూడా ఉంది. ఈ దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ధృవీకరించింది. ఇరాన్ కూడా ఇదే విధంగా ప్రతీకారం తీర్చుకుంటామని స్పందించింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియాలోని చమురు శుద్ధి కర్మాగారం, దుబాయ్‌లోని బూర్జ్‌ ఖలీఫా లగ్జరీ హోటల్‌పై దాడి చేసింది. మరోవైపు ఈ యుద్దం ప్రపంచ ఇంధన సరఫరాకు విపత్కర పరిణామాలను కలిగించనుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.