Reading Time: < 1 minute

అమరావతి: మద్యం మత్తులో ఎఎస్‌ఐ పోలీసులు వాహనాన్ని ఢీకొటి అనంతరం పోలీస్ సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వేటపాలెం పోలీస్ స్టేషన్‌లో పిలి రవి కుమార్ అనే యువకుడు ఎఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్ సెంటరీన్ లూథరన్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎఎస్‌ఐ రవి తన కారులో వెళ్తుండగా పోలీస్ రక్షక్ జీపు తగిలింది. అప్పటికే రవి మద్యం మత్తులో ఉన్నాడు. వెంటనే కారు దిగి కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. సిఐ సుబ్బారావు అక్కడికి చేరుకొని ఎఎస్‌ఐకి సర్ది చెప్పడానిక ప్రయత్నించాడు. మద్యంతో ఎఎస్‌ఐ రవి వీరంగం సృష్టించాడు. రవిని కానిస్టేబుళ్లు కొంత దూరం లాక్కెళ్లి వాహనం ఎక్కించి ఇంటికి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్‌పి ఉమామహేశ్వర్ స్పందించారు. రవిని విఆర్‌కు పంపించారు. విచారణ చేయాలని చీరాల డిఎస్‌పి మొహ్మద్ మొయిన్‌కు ఆదేశాలు జారీ చేశారు.