
రఘునాథపల్లి/ స్టేషన్ ఘనపూర్, వెలుగు : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక నిధులతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం లింగాల ఘనపూర్ మండలం చీటూరులో రూ.45 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, మరో రూ.45 లక్షలతో నిర్మించిన తుర్కపల్లి సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. రూ.10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.34.80 లక్షలతో పాఠశాలలో అదనపు తరగతి గదులు, ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
చీటూరుకు రెండున్నరేళ్లలో రూ.2 కోట్ల నిధులు మంజూరు చేశామని, 21 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రెండో విడతలో మరో 20 ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. చీటూరు–కోడూరు రహదారి నిర్మాణానికి సీఎం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. రైతుల సహకారంతో గోదావరి జలాలతో చీటూరు చెరువును నింపేందుకు కృషి చేస్తానని చెప్పారు. అనంతరం రఘునాథపల్లి మండలానికి చెందిన లబ్ధిదారులకు కొత్త డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.