
ఆంధ్ర – ఒడిశా సరిహద్దు అర్థరాత్రి ఒక్కసారిగా అలజడి మొదలైంది. రాత్రి సమయంలో చిత్రకొండ–బలిమెల ఘాట్ రోడ్డు గుండా వెళ్తున్న కొందరు వాహనదారులకు రోడ్డుపై ఏదో రాయి పడి ఉన్నట్లు కనిపించింది. దీంతో దాన్ని తొలగిద్దామని వాహనాలు పక్కకు ఆపి దాని దగ్గరకు వెళ్లిన వాహనదారులకు ఊహించని పరిణామం ఎదురైంది. దాన్ని పట్టుకోవడగానికి వెళ్లగా అది ఒక్కసారిగా కదలడంతో వాహనదారులు భయంతో హడలెత్తిపోయారు. వెంటనే అక్కడి నుంచి వెనక్కి పరుగులు తీశారు.
అయితే రోడ్డుపై జనాలను గమనించిన అటుగా వెళ్తున్న ఓ కారు ప్రయాణికుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. అక్కడ మొసలి ఉన్నట్టు గుర్తించి.. కారు లైట్లను దానిపై ఫోకస్ చేసి ఉంచాడు. దీంతో అక్కడున్న స్థానికులు మొసలి దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి వెంటనే ఈ విషయాన్ని చిత్రకొండ అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో తీవ్రంగా శ్రమించి మొసలిని సురక్షితంగా బంధించారు.
అయితే మొసలి బలిమెల రిజర్వాయర్ నుంచి ఘాట్ రోడ్డుపైకి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు, మొసలిని రెస్క్యూ చేసి అక్కడి నుంచి తరలించడంతో ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.