Reading Time: 2 minutes
Akhilesh Yadav Up Election Promises Women Rs 40000 Aid Reservation

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌తో పాటు గుజరాత్ సహా ఏడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడు రాష్ట్రాలు బీజేపీకి చాలా కీలకమైనవి. దీంతో ఇప్పటికే కాషాయ పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఇక ముచ్చటిగా మూడోసారి యూపీలో అధికారంలోకి రావాలని బీజేపీ తహతహలాడుతోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలు పోటాపోటీగా ప్రజలపై హామీలు కుమ్మరిస్తున్నాయి.

నిన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి భారీగా హామీలు కుమ్మరించారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 12వ తరగతి ఉత్తీర్ణులైన 25 లక్షల మంది బాలికా విద్యార్థినులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, 50 వేల మంది బాలికలకు ఉచితంగా స్కూటీలను అందించే రాణి లక్ష్మీబాయి పథకాన్ని ప్రకటించారు.

తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. మహిళా ఓటర్లు లక్ష్యంగా హామీలు కుమ్మరించారు. 10 భారీ ప్రకటనలు చేశారు. మహిళలకు రూ.40 వేలు, వారానికి రెండు రోజులు సెలవులు.. 33 శాతం ఉద్యోగ రిజర్వేషన్ వంటి హామీలు ఇచ్చారు. పేద మహిళలకు 40,000 రూపాయల సహాయం అందిస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా పెంచుతామని డింపుల్ యాదవ్ చెప్పారు. దీనికి ‘స్త్రీ సమ్మాన్ సమృద్ధి యోజన’ అని పేరు పెట్టారు.

సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి బాలికకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి ఫీజు మాఫీ చేయగా.. ప్రైవేట్ పాఠశాలల్లో సగం ఫీజు చెల్లిస్తామని పేర్కొన్నారు. నెలకు కనీసం రెండు రోజుల సాధారణ సెలవు మంజూరు చేస్తామని.. ప్రతి తహసీల్‌లో ఒక పీజీ కళాశాల, ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి వితంతువుకు, నిరుపేద మహిళకు శాశ్వత ప్రభుత్వ గృహాన్ని అందిస్తామన్నారు. ప్రతి నిరుపేద మహిళకు గౌరవప్రదమైన అంత్యక్రియల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని.. మూసివేసిన 26,000కు పైగా పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లో మహిళా జనాభా ఎంత?

2022 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం.. రాష్ట్రంలో దాదాపు 69.8 మిలియన్ల మహిళా ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 15 కోట్లు. 2022లో ఉత్తర ప్రదేశ్ మొత్తం జనాభా అంచనా దాదాపు 24 కోట్లు ఉంది.