
ఆధునిక జీవనశైలి, అసమతుల్య ఆహారపు అలవాట్ల వల్ల నేటికాలంలో చాలామంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల త్వరగా అలసిపోవడం, నీరసం, మైకం రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యకు ఇంట్లోనే సులభంగా పరిష్కారం చూపేందుకు సూపర్ఫుడ్ లడ్డూలు అద్భుతంగా తోడ్పడతాయి.
సూపర్ఫుడ్ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు
గింజలు తీసిన ఖర్జూరాలు : 1 కప్పు సహజ తీపి, ఐరన్ కోసం
తెల్ల నువ్వులు: 2 స్పూన్లు- కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి
గుమ్మడి విత్తనాలు: 2 స్పూన్లు- జింక్, మెగ్నీషియం నిలయం
బాదం, జీడిపప్పు, వాల్నట్స్: అర కప్పు ముక్కలుగా తరిగినవి
ఎండుద్రాక్ష: 2 స్పూన్లు
దేశీ నెయ్యి: 1 నుండి 2 చెంచాలు
తయారీ విధానం:
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, వాల్నట్స్, నువ్వులు, గుమ్మడి విత్తనాలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. గింజలు తీసిన ఖర్జూరాలను మిక్సీలో లేదా కొద్దిగా నెయ్యిలో వేడి చేసి మెత్తని ముద్దలా చేసుకోవాలి. వేయించిన డ్రైఫ్రూట్స్, విత్తనాలను ఈ ఖర్జూరాల ముద్దలో బాగా కలిపి, వేడి చల్లారాక చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.
ఈ లడ్డూల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ఖర్జూరం, నువ్వులు, ఎండుద్రాక్షలలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని పెంచి హెమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఈ లడ్డూలలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి. ఉదయం అల్పాహారంతో పాటు ఒక లడ్డూ తినడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉత్సాహంగా ఉండవచ్చు.
నువ్వులు, డ్రైఫ్రూట్స్లోని కాల్షియం, మాంగనీస్ ఎముకల సాంద్రతను పెంచి, మహిళల్లో వచ్చే కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఇందులో ఎలాంటి పంచదార లేదా బెల్లం వాడకుండా కేవలం ఖర్జూరం తీపినే ఉపయోగిస్తారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు, డయాబెటిస్ ఉన్నవారు కూడా నిర్భయంగా తినవచ్చు. రోజువారీ ఆహారంలో ఈ సూపర్ఫుడ్ లడ్డూను భాగం చేసుకోవడం ద్వారా మహిళలు రక్తహీనతను నివారించడమే కాకుండా, ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని పొందవచ్చు.