Reading Time: 2 minutes
Pakistan Skardu Airbase Was Indias Operation Sindoor Target Why It Matters

Operation Sindoor: ఆపరేషర్ సిందూర్ గురించి ఇటీవల మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచే సర్గోధా సమీపంలోని కిరాణా హిల్స్‌పై దాడి గురించి చెప్పారు. ఇదే కాకుండా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని స్కార్దుపై కూడా దాడి చేయాలని భావించినట్లు వెల్లడించారు. అయితే, వాతావరణం కారణంగా స్కార్దును వదిలేసి భోలారిపై దాడి చేసినట్లు చెప్పారు. అయితే, ఇప్పుడు స్కార్దు అటాక్ భారత్ హిట్ లిస్టులో ఉండటం చూసి పాకిస్తాన్‌తో పాటు ముఖ్యంగా చైనాకు హెచ్చరిక అవుతుంది.

కార్గిల్‌కు కేవలం 170 కిలోమీటర్ల దూరంలో స్కార్దు ఎయిర్ బేస్ ఉంది. ఇది పాకిస్తాన్‌కు చాలా కీలకమైన ఎయిర్ బేస్. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఈ బేస్‌ నుంచే వ్యూహా రచన చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో ఒక వేళ స్కార్దుపై దాడి జరిగితే పాకిస్తాన్‌కే కాకుండా చైనాకు కూడా పెద్ద సందేశం వెళ్లేదని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)లోని కీలక మౌలిక సదుపాయాలకు స్కార్డు ప్రాంతం భద్రత, లాజిస్టిక్ కవర్ అందించే ప్రాంతాల్లో ఒకటిగా ఉంది.

ఆపరేషన్ సిందూర్‌లో మే 10న జరిగిన వైమానిక దాడుల్లో భోలారి ఎయిర్ బేస్‌పై భారత్ జరిపిన దాడి అత్యంత కీలకమైన చర్యల్లో ఒకటిగా నిలిచింది. కరాచీ సమీపంలో ఉన్న భోలారి బేస్లో JF-17, F-16 వంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. ఈ దాడిలో స్థావరానికి ఆరుగురు సిబ్బంది చనిపోయినట్లు స్వయంగా పాకిస్తాన్ అంగీకరించింది. భోలారితో పాటు నూర్ ఖాన్, రఫీకీ, మురీద్, సర్గోధా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్ తదితర మొత్తం 10కి పైగా వైమానిక స్థావరాలపై భారత వైమానిక దళం బ్రహ్మోస్, SCALP, ర్యాంపేజ్ క్షిపణులతో దాడులు చేసింది.

పాకిస్తాన్‌కు స్కార్దు ఎందుకు కీలకం..

పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో భాగంగా ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్‌లో ఈ స్కార్దు బేస్ ఉంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్కార్దు జస్ట్ మిస్ అయింది. చివరిసారిగా భారత్ 1971 యుద్ధంలో స్కార్దుపై దాడి చేసింది. 1971లో తూర్పు పాకిస్థాన్‌పై ప్రధానంగా దృష్టి ఉన్న సమయంలో, గిల్గిట్, స్కార్డు ప్రాంతాల నుంచి పాకిస్థాన్ చొరబాటు ప్రయత్నాలను భారత్ అడ్డుకుంది.

ఇక స్కార్దు పాకిస్తాన్ కీలక వ్యూహాత్మక స్థావరం. భౌగోలికంగా మంచి స్థానంలో ఉంది. ఇది సింధు నది సమీపంలో ఉన్న స్కార్దు, లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ఓసీ), లడఖ్ ప్రాంతాలకు దగ్గర ఉంటుంది. ఇది భారత లేహ్ ఎయిర్‌బేస్‌కు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ ఆర్మీకి ఇది ఆపరేటింగ్ బేస్‌గా పనిచేసింది. స్కార్దు రన్‌వేకు ఇరుపైపులా బలమైన రక్షన కలిగిన విమానాశ్రయ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో JF-17, మిరాజ్ 2000 వంటి యుద్ధ విమానాలను ఉంచుతున్నట్లు తెలుస్తోంది.

చైనాకు కూడా స్కార్దు కీలకమే..

స్కార్దు ప్రాధాన్యత పెరగడానికి మరో కారణం చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC). చైనా పాకిస్తాన్‌లో నిర్మిస్తున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు స్కార్డు ప్రాంతంలోని సైనిక భద్రత, లాజిస్టిక్ సహాయం కీలకం. దీంతో స్కార్దుపై దాడి చేస్తే చైనాకు ఒక వ్యూహాత్మక సందేశం వెళ్లేదని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు.