
YS Jagan: వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి, ప్రతి పథకాన్ని ప్రకటించిన నెలలోనే అమలు చేశామని తెలిపారు. ప్రతి 50–60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించి, లంచాలు, వివక్షకు తావులేకుండా సంక్షేమాన్ని ప్రజల గడపకే చేర్చామని పేర్కొన్నారు. పార్టీ ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలోనే చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. లంచం లేకుండా ప్రభుత్వ సేవలు అందించవచ్చని తమ ప్రభుత్వం నిరూపించిందన్నారు. తమ ఐదేళ్ల పాలన గురించి ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోవాలని సూచించారు.
విద్య, వైద్య రంగాల్లో మార్పులు
‘నాడు–నేడు’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చామని జగన్ అన్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యను ప్రవేశపెట్టడంతో పాటు మూడో తరగతి నుంచే టోఫెల్ శిక్షణ, ఆరో తరగతి నుంచి డిజిటల్ తరగతులు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందించామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. వైద్య రంగంలో గ్రామస్థాయిలో విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకొచ్చామని జగన్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని ప్రొసీజర్లను 1,000 నుంచి 3,300కు పెంచి, వైద్య పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని చెప్పారు. జీరో వేకెన్సీ విధానంతో వైద్య సిబ్బంది కొరతను తగ్గించామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల కొరతను గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కోసం చర్యలు
తమ పాలనలో రైతులు గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రానివ్వలేదని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రతి కేంద్రంలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ–క్రాప్తో అనుసంధానం చేసి ఉచిత పంటల బీమా అమలు చేశామని, పంట ధరలు తగ్గినప్పుడు వెంటనే స్పందించేలా సీఎం యాప్ వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. ఐదేళ్లలో రూ.7,800 కోట్లు ఖర్చు చేసి మార్కెట్లో పోటీ సృష్టించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించామని జగన్ పేర్కొన్నారు. అలాగే 17 కొత్త మెడికల్ కాలేజీలు, నాలుగు పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. కర్నూలు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కడప, భోగాపురం విమానాశ్రయాల అభివృద్ధికి చర్యలు చేపట్టామని చెప్పారు.
ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం: జగన్
శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.600 కోట్లతో ఉపరితల జలాల ప్రాజెక్టును చేపట్టామని జగన్ అన్నారు. ఉద్దానం ప్రజలకు సురక్షిత తాగునీటితో పాటు కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజల సమస్యల మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారాలు చూపిన ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమని అన్నారు.
కూటమి హామీలపై జగన్ విమర్శలు
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కొనసాగించడంతో పాటు వాటికంటే మూడింతలు ఎక్కువ ఇస్తామని కూటమి హామీ ఇచ్చిందన్నారు. అమ్మ ఒడి, చేయూత, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను బాండ్ల రూపంలో ప్రజలకు ఇచ్చారని ఆరోపించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని జగన్ విమర్శించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనకు, కూటమి ప్రభుత్వ పాలనకు మధ్య తేడాపై ప్రస్తుతం ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని అన్నారు.
‘రెడ్బుక్ రాజ్యాంగం’ అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు
ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు శిథిలావస్థకు చేరాయని జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ బకాయిల కారణంగా పేదలు ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యవసాయ రంగం తిరోగమనంలోకి వెళ్లిందని, రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని విమర్శించారు. ఆర్బీకేలు, ఈ–క్రాప్, ఉచిత పంటల బీమా వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మహిళలకు కొత్త పథకాలు ఇవ్వకపోగా, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను కూడా రద్దు చేశారని జగన్ విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టి లొంగదీసుకునే పాలన సాగుతోందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలోని వ్యవస్థలు ‘రెడ్బుక్ రాజ్యాంగం’ కారణంగా కుప్పకూలుతున్నాయని విమర్శించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..
