బెంగాల్, అస్సాం వంటి కొన్ని రాష్ట్రాలో జెర్రి పోతు పామును పాములకు అధిదేవత అయిన మానసా దేవిగా పూజిస్తారు. అది ఇంటిలోకి వచ్చినప్పుడు దానికి పూజలు చేయడం వలన అది విషపూరితమైన పాము కాటు నుంచి రక్షిస్తుందని వారి నమ్మకం. ఇక మానస పుత్రిక నాగులకు రాణి అని పురాణం చెబుతుంది. అందుకే అక్కడి వారు విషరహితమైన జెర్రిపోతును మానసా దేవిగా పూజిస్తుంటారు.
అయితే ఒక రోజు రాత్రి సమయంలో అత్యంత విషపూరితమైన కట్ల పాము ఒక వ్యక్తి ఇంటిలోకి ప్రవేశించింది. అది గమనించిన వ్యక్తి, అది విషపూరితమైనదని గ్రహించకుండా, జెర్రిపోతు, మానస మాతనే తమ ఇంటిలో ఆశ్రయం పొందడానికి వచ్చిందని, దానికి పాలు పోసి, అరటి పండ్లు, పువ్వులు వేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించారు. అంతే కాకుండా కుటుంబం మొత్తం ఆ రోజు రాత్రి మొత్తం ఆ పాముతోనే గడిపారు.
అయితే ఉదయం ఇరుగు పొరుగు వారు, అతని ఇంటికి నిజంగానే మానసా దేవి వచ్చి ఉందని భావించి చూడటానికి వచ్చారు. కానీ దానిని చూసి అనుమానం వచ్చిన కొంత మంది వ్యక్తులు, స్నేక్ క్యాచర్, పర్యావరణ వేత్తలకు సమాచారం అందించగా, భజన్ సాహా అనే స్నేక్ క్యాచర్, ఆ పామును చూసి విస్తుపోయాడు.
దానిని చూసిన వెంటనే అది అత్యంత విషపూరితమైన కట్లపాము అని చెప్పడంతో, పామును పూజించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. అప్పటికే ఆ పాము ఒక మూలకు చుట్టలు చుట్టుకొని కూర్చొని ఉంది. దాని చుట్టూ పూలు, ముందు అరటి పండ్లు, పాలు ఉన్నాయి.
యజమానిని స్నేక్ క్యాచర్ ప్రశ్నించగా, అది మానసాదేవి మహిమగల జెర్రిపోతు పాము అనుకొని దానికి పూజలు చేసాను అని చెప్పాడు. కానీ అది అత్యంత విషపూరితమైన పాము అని తెలుసుకొని షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆయన రాత్రి మొత్తందానికి చాలా దగ్గరగా ఉన్నాడు, అది కాటు వేసి ఉంటే, తన ప్రాణానికే ప్రమాదం వాటిల్లేది.ఇక స్నేక్ క్యాచర్ పాను ససురక్షితంగా రక్షించి అడవిలో వదిలి పెట్టాడు. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఊపిరి పీల్చుకున్నారు.




