
సొంత ఇల్లు కొనుగోలు చేయడం భారతీయుల ప్రధాన ఆర్థిక లక్ష్యాల్లో ఒకటిగా మారుతోంది. తాజాగా విడుదలైన Home Credit India ‘The Great Indian Wallet 2026’ సర్వే ప్రకారం.. దిగువ మధ్యతరగతి భారతీయుల్లో 31 శాతం మంది వచ్చే ఐదేళ్లలో సొంత ఇల్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 8 శాతం పాయింట్లు పెరగడం విశేషం. ఆర్థిక పరంగా భారతీయ కుటుంబాల్లో ఆర్థిక భద్రతపై నమ్మకం పెరుగడానికి ఇది సంకేతంగా నిలుస్తోంది. తక్షణ అవసరాలు, వినియోగం కంటే దీర్ఘకాలిక ఆస్తులను సమకూర్చుకోవడంపైనే ప్రజలు ఎక్కువగా దృష్టి పెడుతున్నారని సర్వే వెల్లడించింది.
మహిళల్లో మరింత ఆసక్తి
ఇల్లు కొనుగోలు చేయాలనే ఆకాంక్ష మహిళల్లో మరింత ఎక్కువగా కనిపించింది. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 40 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ఇల్లు కొనడం తమ ప్రధాన ఆర్థిక లక్ష్యమని చెప్పారు. పురుషుల్లో ఈ వాటా 29 శాతంగానే ఉంది. పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ మంది సొంతింటి కలను సాకారం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఆర్థిక భరోసా పెరుగుతోంది
ముఖ్యంగా పొదుపు, పెట్టుబడుల విభాగాల్లో ప్రజల్లో ఆసక్తి పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. 85 శాతం మంది తమ వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలను వచ్చే ఐదేళ్లలో సాధించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరో 87 శాతం మంది తమ మొత్తం ఆర్థిక పరిస్థితి భవిష్యత్తులో మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహన కొనుగోలు, అంతర్జాతీయ ప్రయాణం వంటి స్వల్పకాలిక లక్ష్యాలపై ఆసక్తి కొంత తగ్గగా, సొంత ఇల్లు వంటి దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు ప్రాధాన్యం పెరిగింది.
వ్యాపారంపై జెన్ జీలో ఆసక్తి
మరోవైపు వ్యాపారం ప్రారంభించడం లేదా విస్తరించాలనే ఆలోచన కూడా యువతలో ఉంది. ముఖ్యంగా Gen Zలో 31 శాతం మంది వచ్చే ఐదేళ్లలో వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సర్వే తెలిపింది. మొత్తంగా చూస్తే.. పొదుపు, పెట్టుబడులు, ఆస్తుల సమీకరణపై పెరుగుతున్న ఆసక్తి.. భారతీయుల ఆర్థిక ఆలోచనా విధానంలో మార్పును సూచిస్తోంది.