
India-Iran Trade: ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్’ పేరిట తీవ్రమైన ఆర్థిక దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో ఇరాన్ నుంచి చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారం సాగిస్తున్న నాలుగు భారతీయ కంపెనీలతో పాటు ముగ్గురు భారతీయ పౌరులపై వాషింగ్టన్ కఠిన ఆంక్షలు విధించింది. దాదాపు 119 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ సంబంధిత లావాదేవీల ఆరోపణలతో ఈ చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 2024 నుంచి జూన్ 2025 మధ్య ఇరాన్ నుంచి సుమారు 69 మిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నందుకు సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్పై ఆంక్షలు పడ్డాయి. గతంలో అమెరికా ఆంక్షలు ఎదుర్కొన్న బొంజోర్ కమోడిటీ ఎఫ్జెడ్ఈ సంస్థతో కూడా ఈ కంపెనీకి సంబంధాలు ఉన్నట్లు తేలింది. అలాగే చెరో 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం దిగుమతులు చేసుకున్న ఆరోపణలతో పిపి సాఫ్ట్టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతీస్ ఇన్ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లను లక్ష్యంగా చేసుకున్నారు. వీటికి తోడు ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తుల రవాణాను సులభతరం చేసినందుకు కస్టమ్స్ బ్రోకర్ సంస్థ పోర్టీస్ పార్ట్నర్స్పై, దాని భాగస్వాములు ఇద్రిస్మియా అష్రఫ్మియా షేక్, హరీష్ రామచంద్ర రంగీలతో పాటు పిపి సాఫ్ట్టెక్ డైరెక్టర్ ప్రశాంత్ గార్గ్లపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది.
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేందుకు తాము ఒక “ఆర్థిక డి-డే”ని ప్రారంభించామని, ఇరాన్ ప్రభుత్వ మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నామని యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పష్టం చేశారు. ఇరాన్తో ఎలాంటి ఆర్థిక బంధం కొనసాగించినా కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో కూడా ఇరాన్ చమురు వ్యాపారంతో సంబంధాలు ఉన్న పలు భారతీయ కంపెనీలపై అమెరికా ఇటువంటి ఆంక్షలే విధించింది. తాజాగా అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ చైనా, హాంకాంగ్లకు చెందిన దాదాపు 20 కంపెనీలు, నలుగురు వ్యక్తులతో కలిపి మొత్తం 60కి పైగా సంస్థలు, వ్యక్తులు, నౌకలపై ఈ ఆంక్షల వర్షం కురిపించింది. అయితే వాషింగ్టన్ చర్యలపై ఇరాన్ తీవ్రంగా మండిపడింది. అమెరికా ఆంక్షలను అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమైన “బహిరంగ బెదిరింపు చర్య”గా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. తమ సార్వభౌమాధికారాన్ని, జాతీయ ప్రయోజనాలను గౌరవించే ఏ గౌరవప్రదమైన దేశం కూడా ఈ చట్టవ్యతిరేకమైన వేధింపులను అంగీకరించదని తేల్చిచెప్పింది. అమెరికా ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి తమ వద్ద రెండేళ్ల వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే ప్రకటించారు. అలాగే అమెరికా చేస్తున్నది కేవలం గొప్పలు చెప్పుకోవడం అని, ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకునే స్థితిలో ఆ దేశం లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బకర్ ఘలీబాఫ్ వ్యాఖ్యానించారు. ఇరాన్తో వాణిజ్యం కొనసాగిస్తున్న భాగస్వామ్య దేశాలు కూడా అమెరికా బెదిరింపులను తీవ్రంగా పరిగణించడం లేదని ఆయన తెలిపారు.