
రైలు ప్రయాణంలో బ్యాగ్ మర్చిపోయినా లేదా దొంగతనానికి గురైనా కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే భారతీయ రైల్వే కల్పించిన కొన్ని సులభమైన మార్గాల ద్వారా మీ వస్తువులను తిరిగి పొందే అవకాశం ఉంది. ఇందుకు మీరు వెంటనే చేయాల్సిన కొన్ని పనులు ఏంటంటే….
ప్రయాణంలో ఉన్నప్పుడు మీ సామాను పోతే ఏం చేయాలి ?
* మొదట వెంటనే వెళ్లి మీ కోచ్ TTE, అటెండెంట్ లేదా రైలు గార్డుకు సమాచారం ఇవ్వండి.
* తరువాత రైలులో పెట్రోలింగ్ చేసే GRP/RPF పోలీసుల దగ్గర ‘ఎఫ్ఐఆర్ ఫారం’ తీసుకుని, వివరాలు రాసి వారికి ఇవ్వండి.
*ఇప్పుడు మీరు దిగే స్టేషన్లోని GRP పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు.
రైలు దిగాక బ్యాగ్ ట్రైన్ లోపలే ఉందని గుర్తుకొస్తే?
* వెంటనే స్టేషన్ మాస్టర్ ఆఫీస్కు వెళ్లండి. వారు తరువాత స్టేషన్ అధికారులకు వైర్లెస్ ద్వారా సమాచారం ఇచ్చి, మీ బ్యాగ్ను సురక్షితంగా కిందకు దింపుతారు.
*మిషన్ అమానత్ (Mission Amanat): రైళ్లలో దొరికిన లేదా మర్చిపోయిన సామాను ఫోటోలను RPF పోలీసులు ఆన్ లైన్ పోర్టల్.. జోనల్ రైల్వే వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. అక్కడ మీ బ్యాగ్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.
ఇంట్లో నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం ఎలా?
*హెల్ప్లైన్ నంబర్ 139కి కాల్ చేసి మీ PNR నంబర్, రైలు నంబర్, కోచ్, సీటు వివరాలు చెప్పి ఫిర్యాదు నమోదు చేయండి.
*రైల్మదాద్ (RailMadad) యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, PNR వివరాలతో నేరుగా ఆన్లైన్ ఫిర్యాదు చేయవచ్చు.
పోయిన వస్తువులు తిరిగితీసుకునేటప్పుడు ఇవి ముఖ్యం:
*స్టేషన్లో దొరికిన లేదా మర్చిపోయిన వస్తువులను కేవలం 24 గంటలు మాత్రమే అక్కడి ఆఫీస్లో ఉంచుతారు. ఆ తర్వాత వాటిని జోనల్ డివిజనల్ ఆఫీస్కు పంపుతారు.
*మీరు పోగొట్టుకున్న బ్యాగ్ తీసుకోవడానికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మీ ఆధార్ కార్డ్ లేదా ఇతర ఐడీ, మీ రైలు టికెట్ (PNR) తీసుకెళ్ళడం మర్చిపోవద్దు.