Reading Time: 2 minutes
Srisailam Tragedy Five Family Members Die By Suicide At Vaddera Satram

Srisailam Tragedy: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలోని 11వ నంబర్ గదిలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతులు సత్యసాయి జిల్లా బత్తలపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సుధాకర్ కుటుంబం గత నెల 28న ఆటోలో శ్రీశైలానికి వచ్చి వడ్డెర సత్రంలో గది తీసుకుంది. మూడు రోజులుగా వారు బయటకు రాకపోవడంతో పాటు గది నుంచి దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులకు అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ముగ్గురు మహిళలు బాత్రూమ్‌లో, ఇద్దరు పురుషులు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు.

మృతులను పల్లపు సుధాకర్, పల్లపు ఆదిలక్ష్మి, పల్లపు మల్లేశ్వరి, పల్లపు శ్రీదేవి, గోగుల మణికంఠగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. సుధాకర్ తన ముగ్గురు అక్కలు, అల్లుడితో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సుధాకర్ గతంలో బత్తలపల్లిలో పలువురి వద్ద సుమారు కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పులు తీర్చలేక కొంతకాలం ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన అనంతరం తిరిగి వచ్చి ఆటో నడుపుతున్నట్లు సమాచారం. గతంలో ఆటో స్టాండ్ యూనియన్ లీడర్‌గా కూడా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు.

కుటుంబంలో ఇద్దరు అక్కలను వారి భర్తలు వదిలేయడం, మరో అక్కకు వివాహం కాకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలు ఆత్మహత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కుటుంబ సభ్యుల మృతికి అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. మరోవైపు, మృతుల్లో ఒకరైన శ్రీదేవికి పక్షవాతం రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులంతా కలిసి సుమారు నెల రోజుల క్రితం విరూపాక్షపురానికి వెళ్లినట్లు బంధువులు తెలిపారు. అక్కడి నుంచి ఐదుగురూ కలిసి శ్రీశైలానికి వచ్చి వడ్డెర సత్రంలో గది తీసుకున్నట్లు తెలుస్తోంది. బంధువులు ఫోన్ చేసినప్పుడు తాము శ్రీశైలంలో ఉన్నామని వారు చెప్పినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు.. వడ్డెర సత్రంలో ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాన్ని శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పరిశీలించారు.. క్షేత్రంలో ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అన్నారు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం ద్వారా పరిష్కరించుకోవాలి.. కానీ, ప్రాణాలు తీసుకోవడం సరికాదన్నారు.. ఇక, సత్రం నిర్వాహకులు కూడా 48 గంటలకు మించి రూమ్ ఇవ్వకూడదు, అసలు ఎలా ఇచ్చారు అని నిలదీశారు.. సత్రం నిర్వాహకులకు కూడా నోటీసు ఇస్తాం, క్షేత్రంలోని అన్ని సత్రాల నిర్వాహకులు రూల్స్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.. ఇక, ఈ ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ చేయాలని కోరారు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు..