
మేడిపల్లి, వెలుగు: 22ఏ జీవో కారణంగా భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే అసెంబ్లీని నడవనియ్యమని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలోని బోడుప్పల్ ఉన్న తిరుమల మీడోస్ కాలనీలో 22ఏ భూ బాధితులతో ఆయన ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22ఏ జీవో కారణంగా భూములు, ఇండ్లు, ఫ్లాట్లను అవసరమైనప్పుడు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల ఆస్తులపై ఆంక్షలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద మొత్తంలో భూములను 22ఏ కింద నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. భూముల విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అసలు హక్కుదారులు కూడా తమ ఆస్తులపై హక్కులను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. భూములపై వివాదాలు ఉంటే చట్టపరమైన ప్రక్రియ ద్వారా పరిష్కరించాలి తప్ప, వేలాది కుటుంబాలను అనిశ్చితిలోకి నెట్టడం సరికాదన్నారు. కమీషన్ల కోసమే జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. భూముల రికార్డుల నిర్వహణ, భూ భారతి పోర్టల్ వ్యవహారంపైనా హరీశ్రావు అనుమానాలు వ్యక్తం చేశారు. భూముల వివరాల డిజిటలైజేషన్ పేరుతో విలువైన ప్రభుత్వ, వివాదాస్పద భూముల విషయంలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు.