
జీవితాన్ని వేరొకరితో పోల్చుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పే సరైన ఉదాహరణ ఇది. చెల్లెలికి సంతానం కలిగిందని.. తనకు కాలేదని మనస్థాపంతో ఉరేసుకున్నాడు ఓ అన్న. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళితే.. మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో రోహిత్ అనే యువకుడు దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెల్లెలికి సంతానం కలిగి తనకు సంతానం కలగడం లేదని మనస్థాపం చెంది ఇంతపని చేశాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొడుకు రోహిత్, కూతురు రోహిణిలకు ఒకే సంవత్సరం పెళ్లిళ్లు చేసినట్లు తండ్రి మాకునూరి రమేష్ చెప్పారు. అన్న చెల్లెళ్లకు ఇద్దరికీ ఒకేసారి పెళ్లి అయినా రోహిత్ కు పిల్లలు కాలేదని.. అదే సమయంలో చెల్లెలు రోహిణికి సోమవారం (ఆగస్టు 24) రెండో సంతానం కలగడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
తన చెల్లెలికి ఇద్దరు సంతానం కలిగిన తనకు సంతానం కలగడం లేదని మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.