Reading Time: 2 minutes
ఒక్కరితో ఇద్దరు ఎఫైర్.. కట్‌చేస్తే, దారుణం.. గుంటూరులో ఓ మహిళ చుట్టూ నడిచిన క్రైమ్ స్టోరీ ఇది..

గుంటూరు నల్లపాడు ఎకో పార్క్ సమీపంలో ఒక మృతదేహం ఉన్నట్లు నల్లపాడు పోలీసులకు సమాచారం వచ్చింది. మృతదేహాన్ని పరిశీలించగా మొదట మహిళ డెడ్ బాడీగా భావించారు. హత్య చేసి పెట్రోల్ పోసి తగుల బెట్టినట్లు ఒక అంచనాకు వచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ.. దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. మృతదేహం స్వాధీనం అనంతరం.. పోలీసులు సమాచారం సేకరించగా.. ఆ మృతదేహం మహిళది కాదు.. యువకుడిదిగా తేల్చారు. పెదపలకలూరుకు చెందిన ప్రసన్నకుమార్ బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాకపోవడంతో అతనే హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారు. బుల్లయ్య అనే వ్యక్తి ఫోన్ చేసి రమ్మంటే ప్రసన్న కుమార్ వెళ్లినట్లు ఇంట్లో వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బులయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించారు.. ఈ విచారణలో తానే ప్రసన్న కుమార్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

పెదపలకలూరుకు చెందిన ప్రసన్న కుమార్ గత మూడు నెలలుగా బుల్లయ్య వద్ద కట్టెపుల్లల పనికి వెళుతున్నాడు. ఇక్కడ పనిచేసే ఒక మహిళతో ప్రసన్న కుమార్ కి పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. అయితే, బుల్లయ్య సోదరుడు వెంకటయ్య కూడా అదే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రసన్న కుమార్ ప్రవర్తనపై అనుమానం వచ్చిన వెంకటయ్య ఆ మహిళను నిలదీయగా ప్రసన్న కుమార్ తో ఉన్న రిలేషన్ విషయాన్ని అతనికి చెప్పింది. దీంతో వెంకటయ్య, బుల్లయ్య ఇద్దరూ ప్రసన్న కుమార్ మీద కక్ష పెంచుకున్నారు. తమ వద్ద పనిచేస్తూ తమకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని అవమానంగా భావించారు. ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకున్నారు.

ఈ నెల పదమూడో తేదిన ఏమీ తెలియనట్లుగా బుల్లయ్య.. ప్రసన్న కుమార్ కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. దీంతో ప్రసన్న కుమార్ పని ఉందన్న భావనతో తురకపాలెం వచ్చాడు. అక్కడ సోదరులిద్దరూ ప్రసన్నకుమార్ పై దాడి చేసి హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ విషయం మూడు నాలుగు రోజుల పాటు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే పొలాలకు వెళ్లిన రైతులు పూర్తిగా కాలిపోయిన మ్రతదేహాన్ని గుర్తించి పోలీసులు సమాచారం అందించడంతో ప్రసన్న కుమార్ హత్య విషయం వెలుగు చూసింది. ప్రస్తుతం బుల్లయ్య, అతని సోదరుడు వెంకటయ్య పోలీసులు అదుపులోనే ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఎవరైనా హత్యలో పాల్గొన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..