
OTR: వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేత దువ్వాడ శ్రీనివాస్. 2024 ఎన్నికల్లో టెక్కలి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. అదే సమయంలో దువ్వాడ కుటుంబ వ్యవహారం ఇటు రాజకీయంగానూ, అటు నైతికంగానూ తీవ్ర చర్చకు దారితీసింది. అయినా సరే… పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ టెక్కలిలో ఓవైపు మంత్రి అచ్చెన్నాయుడిపై రాజకీయ పోరాటం చేస్తూనే, మరోవైపు సొంత పార్టీ నేతలు ధర్మాన సోదరులపై కూడా వరుస విమర్శలు చేశారు. అయితే అనూహ్య పరిణామాలతో 2025 ఏప్రిల్లో వైసీపీ అధిష్టానం… దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. క్రమశిక్షణ ఉల్లంఘనతోపాటు పలు ఫిర్యాదుల కారణంగా ఆయన్ని పార్టీ నుంచి పక్కకు పెట్టారు పెద్దలు. అయితే… సస్పెండ్ చేసి బయటికి సాగనంపినా…. వైసీపీ అధినేత జగన్ని మాత్రం నేరుగా ఎక్కడా విమర్శించలేదు. అయితే పలు సందర్బాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రం ఆపలేదు దువ్వాడ. అదే సమయంలో తనకు వైసీపీ తలుపులు మూసుకుని పోలేదన్నట్టు వ్యవహరించేవారని అంటారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన జగన్తో మాట్లాడేందుకు దువ్వాడ ప్రయత్నించడం కూడా ఆసక్తి రేపింది.
తాజాగా ఇటీవల మండలిలో జరిగిన పరిణామాలతో ఆ చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు, విపక్షనేత బొత్స సత్యనారాయణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో… బొత్సకు మద్దతుగా మంత్రిని టార్గెట్ చేశారు దువ్వాడ. అచ్చెన్నాయుడి వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారాయన. ఇక్కడే.. కథలో కీలక మలుపు కనిపించింది. దువ్వాడ వ్యాఖ్యలపై స్పందించిన బొత్స సత్యనారాయణ.. మా సభ్యుడు అంటూ ఆయన్ని ఉద్దేశించి సంబోధించారు. దీంతో… అధికారికంగా వైసీపీకి దూరంగా ఉన్న నేతను మా సభ్యుడు అని బొత్స ఎందుకు అన్నారు.. అంటూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో డిస్కషన్ నడుస్తోంది. మండలి సమావేశాల్లో వైసీపీ సభ్యులతో దువ్వాడ సన్నిహితంగా ఉన్నారు. వైసీపీ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమే అయినా ముందుగా తన మద్దతు ప్రకటించినట్లు సమాచారం. వైసీపీ సభ్యులతో కలిసి మీడియా సమావేశాల్లో కనిపించటం.. అవసరమైన సందర్భాల్లో ఆ పార్టీ వాదనకు మద్దతుగా మాట్లాడటం వంటి సీన్స్ కనిపించాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసినా జగన్పై సాఫ్ట్ కార్నర్ కొనసాగిస్తుండటం లాంటి పరిణామాలన్నిటినీ కలిపి చూస్తే.. దువ్వాడ వైసీపీకి టెక్నికల్గా దూరంగా ఉన్నా…పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు.
దీంతో… దువ్వాడ శ్రీనివాస్ మళ్లీ వైసీపీలోకి రావాలనుకుంటున్నారా.. లేక మండలిలో తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ వైఖరి కొనసాగిస్తున్నారా..అన్న సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ దువ్వాడ తిరిగి పార్టీలోకి రావాలనుకుంటే వైసీపీ అధిష్టానం అందుకు సానుకూలంగా ఉంటుందా..అన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. టెక్కలిలో పార్టీ సమీకరణాలు.. అచ్చెన్నాయుడితో దువ్వాడకు ఉన్న రాజకీయ వైరం.. ధర్మాన సోదరులతో విభేదాలు.. ఇవన్నీ లెక్కలోకి తీసుకోవాల్సినవేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. అయితే…. అధికారికంగా సస్పెన్షన్లో ఉన్న నేత వైసీపీ సభ్యులతో కలిసి అడుగులు వేయటం, అవసరమైనప్పుడు వైసీపీకి మద్దతివ్వడం, అన్నిటికీ మించి…. బొత్స వంటి సీనియర్ నేత నోట మా సభ్యుడు అన్న మాట రావడం లాంటివాటన్నిటినీ కలిపి చూస్తుంటే మాత్రం దువ్వాడ రాజకీయ ప్రయాణం మళ్లీ వైసీపీ వైపు టర్న్ అయినట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఇక బొత్స యాధృచ్చికంగా దువ్వాడను ఉద్దేశించి మా సభ్యుడని అన్నారా.. లేక దానివెనుక రాజకీయ కోణం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ధర్మాన బ్రదర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందని కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. అటు పార్టీ అధినేత జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా..? లేక నిత్యం వివాదాల్లో ఉండే వ్యక్తితో మనకెందుకొచ్చిన పంచాయతీ అంటూ లైట్ తీసుకుంటారా.. అన్నది ఇంట్రస్టింగ్ పాయింట్.