Reading Time: < 1 minute
Telangana Secretariat Cm Revanth Reddy Lift Security Lapse

CM Security : తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతలో తీవ్ర లోపం బయటపడటం కలకలం రేపింది. సచివాలయ గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని 29వ నెంబర్‌ హాల్‌లో సీఎం మీడియా సమావేశానికి ఏర్పాట్లు చేయగా, అక్కడికి చేరుకునేందుకు ముఖ్యమంతంత్రితో పాటు ఇతర ముఖ్య నేతలు లిఫ్ట్‌ ఎక్కారు. అయితే, నిర్ణీత గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆగాల్సిన లిఫ్ట్ సాంకేతిక సమస్యతో హఠాత్తుగా ఫస్ట్‌ఫ్లోర్‌లో ఆగిపోయింది. దీంతో వేరే దారి లేక సీఎం నేరుగా ఫస్ట్‌ ఫ్లోర్‌లోని 32 నెంబర్‌ గదికి వెళ్లి, ఆ తర్వాత మెట్ల మార్గంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని మీడియా హాల్‌కు చేరుకోవాల్సి వచ్చింది.

 

ఈ అనూహ్య పరిణామంతో ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అత్యున్నత భద్రత ఉండాల్సిన ప్రదేశంలో ఇలాంటి లోపం తలెత్తడంపై ఇంటెలిజెన్స్, ఈఎస్డబ్ల్యూ (ESW) అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ సీఎస్‌ఓ (CSO) నిర్లక్ష్యం వల్లే ఈ భద్రతా వీక్‌నెస్ బయటపడిందని మండిపడుతూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది.