
Healthy Lifestyle: మన ఆరోగ్యంపై ఆహారం మాత్రమే కాదు.. ఆహారం తీసుకునే సమయం కూడా ప్రభావం చూపుతుందా? అంటే అవుననే అంటున్నారు వైద్యులు. ఉదయం బ్రేక్ఫాస్ట్ ఆలస్యంగా చేయడం, రాత్రి చాలా ఆలస్యంగా డిన్నర్ చేయడం వంటివి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధనల్లో వెలుగు చూసినట్లు తెలిపారు. అమెరికాలో 40 ఏళ్లు పైబడిన 31 వేల మందికి పైగా వ్యక్తుల డేటాను పరిశీలించి ఈ అధ్యయనం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1999 నుంచి 2018 మధ్య వారి ఆహారం తీసుకునే సమయాలను నమోదు చేసి, అనంతరం వారి డెత్ రికార్డులతో పోల్చినట్లు వెల్లడించారు. సుమారు 8.6 ఏళ్ల ఫాలోఅప్లో 7,129 మంది మరణించినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన European Journal of Clinical Nutrition లో ప్రచురితమైంది.
బ్రేక్ఫాస్ట్కు ఇదే సరైన సమయమా?
తాజా అధ్యయనం ప్రకారం.. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం మంచిదని సూచించింది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య మొదటి భోజనం చేసేవారిలో ఏ కారణంతోనైనా మరణించే ప్రమాదం 10 శాతం ఎక్కువగా కనిపించిందని చెప్పారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య భోజనం చేసేవారిలో ఈ ప్రమాదం 19 శాతంగా నమోదైంది. ఇక మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోజులో మొదటి భోజనం చేసేవారిలో ఈ ప్రమాదం 29 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. 50 ఏళ్ల వయసులో మధ్యాహ్నం తర్వాత భోజనం చేసేవారిలో సగటు ఆయుర్దాయం సుమారు 2.46 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు డేటా సూచించింది.
డిన్నర్ కూడా..
రాత్రి చాలా ఆలస్యంగా, ముఖ్యంగా అర్ధరాత్రి తర్వాత భోజనం చేసేవారిలో మరణించే ప్రమాదం 27 శాతం ఎక్కువగా కనిపించింది. వారి సగటు ఆయుర్దాయం కూడా 2.35 ఏళ్లు తక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది. అయితే సాయంత్రం 7 గంటల కంటే ముందే డిన్నర్ చేసేవారిలోనూ ప్రమాదం 13 శాతం ఎక్కువగా కనిపించింది. అత్యల్ప ప్రమాదం మాత్రం రాత్రి 8 గంటల సమయంలో చివరి భోజనం చేసేవారిలో నమోదైంది. అయితే ఆలస్యంగా తినడం వల్లే ఆయుష్షు తగ్గుతుందని ఈ అధ్యయనం నిరూపించలేదు. వయసు, బరువు, ఆహారం, వ్యాయామం, స్మోకింగ్, తాగుడు, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయని పరిశోధకులు స్పష్టం చేశారు. అందువల్ల భోజన సమయంతో పాటు మొత్తం జీవనశైలిపై కూడా దృష్టి పెట్టడం ముఖ్యమని సూచించారు.