Reading Time: 3 minutes
Trump Tulsi Gabbard Iran War Warnings Before Strikes

ఇరాన్‌పై అమెరికా యుద్ధానికి ముందు మాజీ జాతీయ నిఘా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ సహా పలువురు ఉన్నతాధికారులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ దర్యాప్తు కథనం పేర్కొంది. ఇరాన్‌పై పూర్తి స్థాయి దాడికి దిగితే సుదీర్ఘమైన, ఖర్చుతో కూడిన యుద్ధంగా మారే అవకాశం ఉందని గబ్బార్డ్ హెచ్చరించినట్లు సమాచారం. అయినప్పటికీ ట్రంప్ ఫిబ్రవరిలో సైనిక చర్యకు అనుమతి ఇచ్చారని కథనం తెలిపింది.

ఇరాన్‌పై దాడి చేస్తే అక్కడి ప్రభుత్వం కూలిపోవడం కంటే మరింత కఠినంగా మారే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు అంచనా వేసినట్లు సమాచారం. అలాగే హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం కలగడం, మధ్యప్రాచ్యం అంతటా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడం వంటి ప్రమాదాలపై కూడా ట్రంప్‌కు ముందుగానే హెచ్చరికలు అందినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమై దాదాపు ఆరు నెలలు గడిచిన నేపథ్యంలో.. అప్పట్లో నిఘా వర్గాలు వ్యక్తం చేసిన అనేక ఆందోళనలు ఇప్పుడు ఘర్షణలో కీలక అంశాలుగా మారాయి.

ట్రంప్‌ను గబ్బార్డ్ ఏం హెచ్చరించారు?

వాల్ స్ట్రీట్ జర్నల్‌ను ఉటంకిస్తూ పలువురు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 28న దాడులు ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు తులసీ గబ్బార్డ్ ట్రంప్‌కు నిఘా నివేదికను వివరించారు. ఇరాన్ నాయకత్వం, అణు మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తే వెంటనే టెహ్రాన్ లొంగిపోతుందనే అంచనాలు సరైనవి కావచ్చని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకోవడం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టమయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు సమాచారం. ఖమేనీని తొలగిస్తే ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఇరాన్ ప్రభుత్వం కూలిపోవడం తప్పనిసరి కాదని అమెరికా నిఘా వర్గాలు భావించినట్లు తెలుస్తోంది. దీనికి బదులుగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌లోని కఠినవాదులు మరింత బలపడే అవకాశం ఉందని.. ప్రభుత్వం మనుగడ కోసం అణ్వాయుధాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టవచ్చని గబ్బార్డ్ హెచ్చరించినట్లు సమాచారం.

హార్ముజ్ జలసంధి విషయంలోనూ గబ్బార్డ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అమెరికా భారీ దాడికి ప్రతిస్పందనగా ఇరాన్ సముద్రపు మైన్లు, నౌకాదళ బలగాలు, యాంటీ-షిప్ క్షిపణులను ఉపయోగించి ఈ కీలక జలమార్గంలో రాకపోకలను అడ్డుకోవచ్చని నిఘా అంచనాలు సూచించినట్లు సమాచారం. ప్రపంచ పెట్రోలియం, ద్రవీకృత సహజవాయువు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు సాధారణంగా హార్ముజ్ జలసంధి గుండా వెళ్తుంది. దీంతో ఈ మార్గంలో దీర్ఘకాలిక అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన మార్కెట్లు, వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇరాన్ ప్రతీకార దాడులపైనా గబ్బార్డ్ హెచ్చరించారు. ఇరాక్, సిరియా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, కీలక మౌలిక సదుపాయాలను ఇరాన్ బలగాలు, దానికి అనుబంధ గ్రూపులు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నట్లు సమాచారం.

గబ్బార్డ్‌తో పాటు జేడీ వాన్స్ కూడా..

ఇరాన్‌తో బహిరంగ యుద్ధాన్ని వ్యతిరేకించిన ఉన్నతాధికారి గబ్బార్డ్ ఒక్కరే కాదని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశాల్లో ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థ, సైనిక వ్యవస్థపై ఊహించని పరిణామాలకు దారితీయవచ్చని పదేపదే హెచ్చరించినట్లు సమాచారం. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలు, ఆర్థిక ఒత్తిళ్లను పూర్తిగా ఉపయోగించుకున్న తర్వాతే భారీ సైనిక చర్యకు దిగాలని వాన్స్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే పెంటగాన్ అధికారులు, ఇజ్రాయెల్ నేతల నుంచి మరింత ఆశావహ అంచనాలు వచ్చాయి. ఇరాన్ బలహీనమైన పరిస్థితిలో ఉందని, ఆ దేశ అణు కార్యక్రమం, సైనిక మౌలిక సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీయడానికి ఇదే సరైన సమయమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తదితరులు వాదించినట్లు సమాచారం.

ట్రంప్ ఎందుకు దాడికి అనుమతించారు?

పెంటగాన్ అధికారులు ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, అణు కేంద్రాలపై విస్తృత దాడులకు సంబంధించిన ప్రణాళికలను ట్రంప్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అయితే దీర్ఘకాలిక యుద్ధం జరిగితే అమెరికా దగ్గర ఉన్న కచ్చితమైన మార్గదర్శక ఆయుధాలు, వైమానిక రక్షణ ఇంటర్‌సెప్టర్ల నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందని సైనిక లాజిస్టిక్స్ అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. ఈ హెచ్చరికలకు భిన్నంగా ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అంచనాలను పరిగణనలోకి తీసుకున్న ట్రంప్ చివరకు ఫిబ్రవరి 28న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి అనుమతి ఇచ్చినట్లు కథనం పేర్కొంది.

తొలి దశలో ఇరాన్ కమాండ్ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడుల్లోనే ఖమేనీ మరణించినట్లు కథనం తెలిపింది. ప్రారంభంలో ఈ ఆపరేషన్‌ను ట్రంప్ ప్రభుత్వం భారీ సైనిక విజయంగా అభివర్ణించింది. ఈ ఘర్షణ కొన్ని వారాల్లోనే ముగిసే అవకాశం ఉందని ట్రంప్ కూడా సూచించారు. అయితే యుద్ధం కొన్ని వారాల్లో ముగియలేదు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ రాజకీయ, భద్రతా వ్యవస్థల్లో కఠినవాద వర్గాలు మరింత బలపడ్డాయని సమాచారం. వాషింగ్టన్ విధించిన షరతులను టెహ్రాన్ అంగీకరించకుండా అమెరికా ఒత్తిడికి ప్రతిఘటన కొనసాగించింది.

అదే సమయంలో హార్ముజ్ జలసంధిలో నౌకా బలగాలు, మైన్లు, తీరప్రాంత క్షిపణుల ద్వారా రాకపోకలకు అంతరాయం కలిగించేందుకు ఇరాన్ చర్యలు చేపట్టినట్లు కథనం పేర్కొంది. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడటంతో పాటు అమెరికా, దాని మిత్రదేశాలపై ఒత్తిడి పెరిగింది. ఇరాన్ బలగాలు, దానికి అనుబంధ గ్రూపులు ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలు, మౌలిక సదుపాయాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగించాయి. మరోవైపు అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు, ఇంటర్‌సెప్టర్లను భారీగా ఉపయోగించాల్సి రావడంతో సైనిక వనరులపై అదనపు భారం పడినట్లు సమాచారం.

తులసీ గబ్బార్డ్ మేలో జాతీయ నిఘా డైరెక్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న తన భర్తకు అండగా ఉండాల్సిన అవసరం కారణంగానే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె అప్పట్లో వెల్లడించారు. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం, ఇతర నివేదికల ప్రకారం.. ఇరాన్ యుద్ధంపై ఆమెకు, ట్రంప్ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన విభేదాలు కూడా వారి సంబంధాలు దెబ్బతినడానికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది. సుదీర్ఘ అమెరికా సైనిక జోక్యాలను వ్యతిరేకిస్తూ గబ్బార్డ్ గతంలో తన రాజకీయ ప్రొఫైల్‌ను నిర్మించుకున్నారు. దీంతో ఇరాన్‌పై సైనిక చర్యకు ముందు ఆమె చేసిన హెచ్చరికలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

యుద్ధం నుంచి ఆర్థిక ఒత్తిళ్ల దిశగా..

యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరాన్ ప్రతిఘటనపై ట్రంప్ అసంతృప్తి పెరిగినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. టెహ్రాన్‌ను లొంగదీసుకునేందుకు మరింత భారీ స్థాయిలో బాంబు దాడులు చేయాలా అనే అంశాన్ని ట్రంప్ పరిశీలించినట్లు సమాచారం. అయితే ఆయనకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి మరింత ఉద్రిక్తతకు దూరంగా ఉండి దౌత్యపరమైన పరిష్కారం కోసం ప్రయత్నించాలని సూచించినట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి ప్రాంతీయ దేశాలు కూడా ఘర్షణ ప్రభావం ప్రాంతీయ భద్రత, ప్రపంచ వాణిజ్యంపై పడుతుందనే ఆందోళన వ్యక్తం చేశాయి.

దీంతో జూన్‌లో 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించినట్లు సమాచారం. అయితే ఆగస్టు 17న ఆ గడువు ముగిసిన తర్వాత కూడా విస్తృత ఒప్పందం కుదరలేదు. ఇరాన్ ఆంక్షల సడలింపు, భవిష్యత్తులో ప్రభుత్వం మార్పు కోసం అమెరికా ప్రయత్నాలు చేయబోదనే హామీలను కోరగా.. ఇరాన్ అణు సామర్థ్యాలను ధృవీకరించగలిగే విధంగా పూర్తిగా తొలగించాలని అమెరికా డిమాండ్ చేసింది.

ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ‘ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్’ వైపు వ్యూహాన్ని మళ్లించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలిక వైమానిక దాడుల స్థానంలో ఆంక్షలు, ఆర్థిక ఒత్తిళ్లు, సముద్ర మార్గాలపై అమలు చర్యలు, తక్షణ ముప్పులకు పరిమిత సైనిక చర్యలపై దృష్టి సారిస్తోంది.

హార్ముజ్ జలసంధి ఇప్పటికీ అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో యుద్ధానికి ముందు గబ్బార్డ్ సహా అమెరికా నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలను ట్రంప్ ప్రభుత్వం ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంది? అన్న అంశంపై తాజా వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం కొత్త చర్చకు తెరతీసింది.