
Nepal-Tibet Flash Floods: నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో సంభవించిన భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ ప్రభావం కైలాస మానస సరోవర్ యాత్రపై పడింది. జలప్రళయం కారణంగా కీలకమైన రహదారులు దెబ్బతినడంతో నేపాల్ మీదుగా జరగాల్సిన మానస సరోవర్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇప్పటికే యాత్రకు బుక్ చేసుకున్న శివ భక్తుల్లో ఆందోళన నెలకొంది.
రేపటి నుంచి షెడ్యూల్ చేసిన యాత్రలు నిలిపివేత
నేపాల్ మీదుగా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లేందుకు భక్తుల బ్యాచ్లను ఇప్పటికే షెడ్యూల్ చేశారు. ముఖ్యంగా ఖాట్మాండు–రసువగఢీ–కీరుంగ్ మార్గం మీదుగా మానస సరోవరం చేరుకునేందుకు పలువురు యాత్రికులు బుకింగ్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పదుల సంఖ్యలో భక్తులు ఈ యాత్రకు బుక్ చేసుకున్నట్లు సమాచారం. అయితే రసువగఢీ ప్రాంతంలో భారీగా వరదలు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. జలప్రళయం కారణంగా మానస సరోవరానికి వెళ్లే రహదారి మార్గాలు మూసుకుపోయాయి. దీంతో రేపటి నుంచి ఖాట్మాండు నుంచి ప్రారంభం కావాల్సిన యాత్రను నిలిపివేసినట్లు సమాచారం.
టూరిస్టులు స్వస్థలాలకు వెళ్లాలని సూచన
ఫ్లాష్ ఫ్లడ్స్ నేపథ్యంలో నేపాల్-టిబెట్ సరిహద్దు అధికారులు పర్యాటకులు, యాత్రికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతంలో రాకపోకలు క్లిష్టంగా మారడంతో యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరో నెల రోజుల పాటు మార్గం మూసివేత?
జలప్రళయం కారణంగా మానస సరోవర్ యాత్రకు ఉపయోగించే మార్గాలు పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మరో నెల రోజుల పాటు మానస సరోవర్ మార్గం మూసి ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెప్టెంబర్ 23వ తేదీకి యాత్ర బుక్ చేసుకున్న భక్తులకు పరిస్థితిని సమీక్షించిన తర్వాత త్వరలో పూర్తి సమాచారం అందిస్తామని అధికారులు, సంబంధిత వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.
కొత్త బుకింగ్స్పై టూర్ ఆపరేటర్లకు కీలక సూచన
ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా చైనా, నేపాల్, టిబెట్ ప్రాంతాలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ కూడా క్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా స్పష్టమయ్యే వరకు కొత్త యాత్రికుల జాబితాలను పంపవద్దని టూర్ ఆపరేటర్లకు సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా, ప్రకృతి వైపరీత్యం కారణంగా కైలాస మానస సరోవర్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రహదారులు పునరుద్ధరణ, సరిహద్దు పరిస్థితులు, అనుమతుల ప్రక్రియ సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే యాత్రలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న భక్తులు అధికారిక సమాచారం కోసం వేచి చూడాల్సి ఉంది.