Reading Time: 3 minutes
India Post: పోస్టాఫీస్‌కు వెళ్లే పనిలేదు.. ఇకపై ఇంటి నుంచే ఇండియా పోస్ట్ సర్వీసులు..

ఒకప్పుడు పోస్టాఫీస్ వేరు, ఇప్పటి పోస్టాఫీస్ వేరు.. వికసితి భారత్ లక్ష్యంలో భాగంగా భారత ఫోస్టాఫీసులు, పోస్టల్ సేవలు కొత్తరూపం దాల్చాయి. అత్యాధునిక వసతులు, సీటింగ్ సదుపాయాలు, పొదుపు ఆధారిత పథకాలతో అనేక సేవలను ఇండియా పోస్ట్ అందిస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా, డిజిటల్ మోడ్‌లో ఇండియా పోస్ట్ సేవలు ప్రజల్లోకి తీసుకొస్తోంది. పోస్టల్ సర్వీస్ ను ఆధునికీకరించి, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా, పారదర్శకంగా అందించేందుకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ కీలక రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టేకేలకు కార్యరూపం దాల్చాయి. ఢిల్లీలోని ఆకాశవాణి భవన్లో డాక్ సేవ డాక్ మిత్ర అప్లికేషన్స్ తో పాటు ఆధునీకరించిన 14 పోస్ట్ ఆఫీస్లను కమ్యూనికేషన్ శాఖ కేంద్ర మంత్రి జ్యోతి రాధిత్య సింధ్య, పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు.

సాంకేతికత ఆధునీకరణ, విధాన సంస్కరణలు, సంస్థాగత సంస్కృతి, ఆధునిక భౌతిక మౌలిక సదుపాయాలు అనే నాలుగు ప్రధాన అంశాలపై పోస్టల్ విభాగం మార్పులు తీసుకువచ్చింది. రూ.5,700 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి రియల్ టైం లాజిస్టిక్ మానిటరింగ్, డిజిటల్ కస్టమర్ సర్వీసెస్, ఫాస్ట్ మెయిల్ ట్రాకింగ్ వంటి వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రస్తుత కాలంలో ప్రజలు తమ ఇంటి వద్దకే సేవలు అందాలని, వ్యాపారాలకు నమ్మకమైన లాజిస్టిక్ సేవలు కావాలని కోరుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోస్టల్ ఉద్యోగులకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సమర్థవంతమైన డిజిటల్ టూల్స్ తో అప్లికేషన్స్ తీసుకువచ్చారు. పోస్టల్ ఇండియా తరతరాలుగా ప్రజల విశ్వాసం, దేశవ్యాప్తంగా విస్తృతమైన నెట్ వర్క్ కలిగి ఉంది, ఈ బలాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి మరింత ప్రజలకు చేరువ చేసేలా ఒకే యాప్‌లో పార్సిల్, బ్యాంకింగ్, యూపీఐ, మనీ ఆర్డర్ సేవలు ఇంటి నుంచే పార్సిల్ పికప్ బుకింగ్‌కు అవకాశం కల్పిస్తూ డిజిటల్ అప్లికేషన్స్ లాంచ్ చేశారు.

ప్రజల కోసం డాక్ సేవ అప్లికేషన్

డాక్ సేవ అప్లికేషన్ ద్వారా సమీప పోస్టాఫీసులను గుర్తించడం, పోస్టేజ్‌లను లెక్కించడం, పార్సిల్ బుకింగ్, పికప్ రిక్వెస్ట్, షిప్ మెంట్ ట్రాకింగ్, ఫిర్యాదులు వంటి అనేక సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి. డొమెస్టిక్ ఇంటర్నేషనల్ మెయిల్ అండ్ పార్సెల్ సర్వీసులతో పాటు యూపీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, కార్డు ద్వారా చెల్లింపులు చేసుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. PLI, RPLI సేవలకు సంబంధించిన ప్రీమియం లెక్కింపులు వంటి సదుపాయాలను కూడా డాక్ సేవ అప్లికేషన్లో అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా 23 భారతీయ భాషల్లో అప్లికేషన్ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గ్రామీణ ప్రాంతాలతో పాటు వివిధ భాషలకు చెందిన ప్రజలకు డిజిటల్ పోస్టల్ సర్వీసులు మరింత సులభంగా అందుబాటులోకి రానున్నాయి. భవిష్యత్తులో పోస్టల్ సేవింగ్స్, PLI, RPLI తదితర సేవలను ఒకే వేదికపై అందించే సూపర్ అప్లికేషన్ గా డాగ్ సేవను మరింత విస్తరించనుంది ఇండియా పోస్ట్.

పోస్టల్ సిబ్బంది కోసం డాక్ మిత్ర అప్లికేషన్

డాక్ సేవ అప్లికేషన్ ద్వారా ప్రజలకు హాస్టల్ సేవలు చేరువ అయితే డాక్ మిత్ర పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి సాధికారత కల్పిస్తుంది. డాక్ మిత్ర అప్లికేషన్ ను 1.3 లక్షల బ్రాంచ్ పోస్టాఫీసుల్లో వినియోగించేలా రూపొందించారు. POSB, PLI, RPLI సేవలు, మెయిల్ అండ్ పార్సెల్ బుకింగ్, బల్క్ అకౌంట్, ఇంటర్నేషనల్ పార్సెల్ తదితర పోస్ట్ ఆఫీస్ కార్యకలాపాలను డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించే అవకాశం సిబ్బందికి లభిస్తుంది. ఓటీపీ ఆధారిత సర్వీసులతో పాటు ఉద్యోగుల చేతుల్లోనే అవసరమైన డిజిటల్ టూల్స్ అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు సేవలందించే వేగం, సామర్థ్యం మరింత పెరగనుంది

పోస్టాఫీసుల్లో ఆధునిక మౌలిక వసతులు

యువతతో ఇండియా పోస్ట్ కి మరింత అనుసంధానం కల్పించేందుకు యూనివర్సిటీలో నెక్స్ట్ జనరేషన్ పోస్టాఫీసులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 110కి పైగా పోస్ట్ ఆఫీస్ లను రీ మోడలింగ్ చేయడంతో పాటు , ప్రధాన నగరాల్లో మరో 40 పోస్టాఫీసులను ఆధునీకరిస్తున్నారు. ప్రజలకు అనుకూలమైన, డిజిటల్ టోకెన్ సిస్టమ్ ద్వారా వినియోగదారులకు మెరుగైన సదుపాయాలతో పోస్టాఫీసులను అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్పుల ప్రధాన లక్ష్యం సులభతర వ్యాపారాన్ని ఆచరణలోకి తీసుకురావడం, పోస్టల్ సేవలను ప్రతి తరానికి మరింత సులభంగా, వేగంగా, ఉపయోగకరంగా మార్చడమేనని కేంద్రం పేర్కొంది

ఏడాదికి 4 వేల కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా కార్యాచరణ

పోస్టల్ శాఖకు ఈ ఏడాది రూ.4,000 కోట్ల అదనపు ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఇప్పటికే తొలి త్రైమాసికంలోనే రూ.800 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందన్నారు. దేశంలో ప్రతి మారుమూల ప్రాంతాలకు ఫోస్టాఫీస్ సేవలు అందించేందుకు కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. దేశవ్యాప్తంగా 110 పోస్టాఫీసుల ఆధునీకరణ జరుగుతుందన్నారు. ఇండియా పోస్ట్ లో జరుగుతున్న ఈ మార్పులు ఒక అప్లికేషన్ లేదా ఒకే సర్వీసుకు పరిమితం కాకుండా, ప్రజలకు సేవలందించే విధానం, సిబ్బంది పనిచేసే విధానం, సాంకేతికత వినియోగం వంటి ప్రతి స్థాయిలో కొనసాగుతున్న సమగ్ర మార్పులని పెమ్మసాని తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.