Reading Time: 3 minutes
Ponguleti Srinivas Reddy 22a Lands Hyderabad

Ponguleti Srinivas Reddy : హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోర్ హైదరాబాద్ పరిధిలో 22ఏ (నిషేధిత భూముల జాబితా) అంశంపై నెలకొన్న గందరగోళం, ప్రతిపక్షాల ఆరోపణలు, రెవెన్యూ శాఖ చేపడుతున్న చర్యలపై ఆయన సుదీర్ఘంగా వివరించారు.

22ఏ భూములపై స్పష్టత.. ప్రతిపక్షాల దుష్ప్రచారంపై ఆగ్రహం

కోర్ హైదరాబాద్ పరిధిలోని 22ఏ భూముల అంశం చాలా జఠిలంగా మారిందని మంత్రి పొంగులేటి తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు కొన్ని నిజాలు, అబద్ధాలు కలిపి ప్రచారం చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. గడిచిన నాలుగు వారాలుగా 22ఏ భూముల అంశంపై రెవెన్యూ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నామని, 22ఏ జాబితా వల్ల నష్టపోయిన నిజమైన బాధితులకు ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. పారదర్శకత కోసం ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశామని వెల్లడించారు. స్లాట్ బుక్ చేసుకుంటున్న వారిలో దాదాపు 98 శాతం మంది రిజిస్ట్రేషన్లను ఇప్పటికే క్లియర్ చేశామని, 300 పైచిలుకు స్లాట్లలో 10 నుంచి 12 మినహా మిగతావన్నీ పూర్తి చేశామని తెలిపారు. అయితే దేవాదాయ, భూదాన్ భూములను రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని స్పష్టం చేశారు.

టోల్ ఫ్రీ నంబర్‌కు విశేష స్పందన.. దొంగ జీవోలపై సీరియస్

టోల్ ఫ్రీ నంబర్ పని చేయడం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను మంత్రి గణాంకాలతో తిప్పికొట్టారు. ఆగస్టు 17న మొదటి రోజు 2 కాల్స్ రాగా, ఆ తర్వాతి రోజుల్లో వరుసగా 116, 168, 200, 369, 309 కాల్స్ చొప్పున మొత్తం 1,162 కాల్స్ వచ్చాయని తెలిపారు. ఇందులో అగ్రికల్చర్ భూములకు సంబంధించి 614, నాన్-అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి 547 కాల్స్ వచ్చాయని, జెన్యూన్ గా ఉన్న 980 కాల్స్‌ను 24 నుంచి 48 గంటల్లో ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పరిష్కరించామని చెప్పారు. ఇదే సమయంలో ప్రజలను మభ్యపెట్టేందుకు కొందరు దొంగ జీవోలు, మెమోలు సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని కంగారు పెట్టి తమ స్వార్థ పనులు పూర్తి చేసుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సీఎస్ 7, సీఎస్ 14 భూములపై ‘సిట్’ విచారణకు సిద్ధం

మేడ్చల్ జిల్లాలోని సీఎస్ 7, సీఎస్ 14 భూములకు సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయని, సుప్రీంకోర్టు ఇచ్చే తుది ఆదేశాల ప్రకారమే రిజిస్ట్రేషన్ల నిర్ణయం ఉంటుందని తెలిపారు. 2017లో నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ భూములపై పోరాటం చేశారని, అప్పట్లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. గత ప్రభుత్వం తమ స్వలాభం కోసం సామాన్యులను అడ్డుపెట్టుకుని పనులు పూర్తి చేసుకుందని విమర్శించారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వానికి చెందిన ఒక పత్రిక ఎండీకి బెంజ్ కారు ఇచ్చారనే వార్తలు చినికి చినికి గాలివానగా మారాయని గుర్తుచేస్తూ, నాటి సీఎస్ 7, సీఎస్ 14 భూముల కుంభకోణంపై ‘సిట్’ విచారణకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

యుఎల్సి, భూదాన్ భూములపై త్వరలో కొత్త పాలసీ

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యుఎల్సి, భూదాన్ భూములకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సమగ్ర విధానాన్ని రూపొందిస్తోంది. నాదర్‌గుల్ (సర్వే నంబర్లు 773, 775, 776, 786), మేడ్చల్ జిల్లా కేంద్రం (సర్వే నంబర్లు 68/1, 70/1, 71)లోని యుఎల్సి భూములకు సంబంధించి కొన్నింటిని క్లియర్ చేశామని, మిగిలిన వాటి క్లియరెన్స్ కోసం త్వరలోనే ఒక స్పష్టమైన పాలసీని తీసుకువస్తామని వెల్లడించారు.

ముఖ్యమంత్రికి, తనకు సంబంధించిన ఇళ్లు కూడా ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నాయని మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 403లోని 1288 ఎకరాల్లో కేవలం రెండు ప్లాట్ల సమస్య ఉంటే, మొత్తం సర్వే నంబర్‌నే నిషేధిత జాబితాలో పెట్టేశారని ఉదాహరించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో సర్వే నంబర్ 173 పట్టా భూమిలో కాకుండా 172 ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. మేడ్చల్ జిల్లా పర్వతపూర్‌లో వేల ఎకరాల విస్తీర్ణం ఉన్న గ్రామానికి, దాని హామ్లెట్ గ్రామానికి గత ప్రభుత్వం ఒకే సర్వే నంబర్ ఇవ్వడం వల్ల సమస్య తీవ్రమైందని, వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. మహేశ్వరం మండలంలోని 22 సర్వే నంబర్‌లో ఉన్న 22 ఎకరాల భూదాన్ భూముల సమస్యతో పాటు ఇతర భూదాన్ భూముల వ్యవహారాలను ‘కేస్ బై కేస్’ పద్ధతిలో లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

మెదక్ ఆక్రమణలు, ‘అబద్ధాలరావు’ పాత్రపై ఆగ్రహం

మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ వంటి పక్క రాష్ట్రాలు భూముల సర్వేపై ప్రత్యేక దృష్టి పెట్టగా, తెలంగాణలో మాత్రం మొదటి నుంచి భూముల సమస్యలు పేరుకుపోయాయని మంత్రి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల ప్రారంభంలో ఏడు నెలల పాటు ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పరిధిలోని సికిందరపూర్ తదితర గ్రామాల్లో 522 ఎకరాల అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో పెట్టారని, ఎన్నికల ముందు 8 నుంచి 12 ఎకరాల చొప్పున ఓఆర్‌సిలు ఇష్టానుసారంగా కట్టబెట్టారని ఆరోపించారు. 1958కి ముందు ఇచ్చినట్లుగా అబద్ధాలు సృష్టించి కలెక్టర్ సహాయంతో ‘అబద్ధాలరావు’ అనే వ్యక్తి తన మనుషులకు ఈ భూములను రాసిచ్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023 డిసెంబర్ 7 నాటికి ఎంత విస్తీర్ణం నిషేధిత జాబితాలో ఉందో, నిన్నటి వరకు ఎన్ని ఎకరాలు చేర్చారో వివరాలన్నీ పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి పేరుతో గ్రామాల్లోకి వెళ్లలేకపోయిన నాయకులు, ఇప్పుడు ప్రజలను అడ్డుపెట్టుకుని ఆడే దొంగ ఆటలను సాగనివ్వమని తేల్చిచెప్పారు.