Reading Time: 2 minutes
Gurugram Rain Flooding Wfh Online Classes Heavy Rain

హర్యానాలోని గురుగ్రామ్‌లో భారీ వర్షం నగరాన్ని మరోసారి అతలాకుతలం చేసింది. కేవలం గంటపాటు కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఉద్యోగస్తులు, విద్యార్థులు నరకయాతన పడ్డారు. ఇళ్లకు చేరుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల్లో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేలా చూడాలని సూచించింది. అలాగే పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశించింది.

Rain

గురుగ్రామ్‌లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుమారు 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. రాజీవ్ చౌక్, ఇఫ్కో చౌక్, రైల్వే రోడ్, సెక్టార్-5, ఓల్డ్ ఢిల్లీ రోడ్, మెహ్రౌలి రోడ్, బసాయ్ రోడ్ తదితర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. వరద నీటిలో వాహనాలు చిక్కుకోవడంతో పలువురు వాహనదారులు వాటిని అక్కడే వదిలి వెళ్లాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

పాఠశాలల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో.. బురద నీటిలో కనిపించని ఓపెన్ మ్యాన్‌హోల్స్‌లో పడకుండా ఉండేందుకు ఎత్తైన బస్‌స్టాప్‌లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వర్షం కారణంగా ఢిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై కూడా ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. రహదారి వెడల్పుగా ఉన్నప్పటికీ వాహనాలు నెమ్మదిగా కదిలాయి. సాధారణంగా సిగ్నేచర్ టవర్ నుంచి హీరో హోండా చౌక్ వరకు సుమారు 15 నిమిషాల్లో చేరుకునే ప్రయాణానికి.. ఈరోజు కనీసం 50 నిమిషాలు పట్టిందని ప్రయాణికులు తెలిపారు. సైబర్ హబ్ సమీపంలో గేట్‌వే టవర్ మెట్రో స్టేషన్‌కు ఎదురుగా ఉన్న ఎక్స్‌ప్రెస్‌వేలోని కొంత భాగం పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో నగరంలోని ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

గురుగ్రామ్‌ను ‘మిలీనియం సిటీ’గా పిలుస్తారు. భారీ అపార్ట్‌మెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రముఖ కంపెనీల కార్యాలయాలకు ఈ నగరం ప్రసిద్ధి. అయితే కొద్దిసేపు భారీ వర్షం కురిసినా మౌలిక వసతులు దెబ్బతినడం, రోడ్లు జలమయం కావడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో ఇప్పటికే వరదలకు గురయ్యే ప్రాంతంగా మారిన షీత్లా మాతా రోడ్ కూడా తాజా వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది. ప్రతి సారి కొంత ఎక్కువ సమయం వర్షం కురిసినప్పుడు నగర మౌలిక వసతులు కుప్పకూలుతున్నాయని గురుగ్రామ్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.