Reading Time: < 1 minute

‘చేయూత’కు వెంటనే అప్లయ్‌‌‌‌ చేసుకోండి..చివరి తేదీ దాకా ఆగొద్దని లబ్ధిదారులకు ప్రభుత్వం సూచన

Caption of Image.
  •     రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3.02 లక్షల అప్లికేషన్లు
  •     ఈ నెల 31తో ముగియనున్న గడువు 
  •     వివిధ భాషల్లో పాటలు, వీడియోలతో సెర్ప్ విస్తృత ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చేయూత పింఛన్ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 31 ఆఖరు తేదీ కావడంతో అర్హత ఉన్నవారు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా అప్లయ్‌‌‌‌ చేసుకోవాలని సూచించింది. ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామ స్థాయి సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులను గుర్తించి దరఖాస్తు చేసుకునేలా చూడాలని ఆదేశించింది. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,02,088 దరఖాస్తులు వచ్చాయి. 

మొత్తం అప్లికేషన్లలో అత్యధికంగా వితంతు పింఛన్ల దరఖాస్తులే ఉన్నాయి. వితంతువులు 1,96,271, దివ్యాంగులు 76,879, గీత కార్మికులు (కల్లుగీత) 14,522, ఒంటరి మహిళలు 8,880, చేనేత కార్మికులు 5,536 దరఖాస్తులు చేసుకున్నారు. అయితే, దరఖాస్తుల గడువు సమీపిస్తున్నందున అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఏ ఒక్క అర్హుడూ పింఛన్ ప్రయోజనానికి దూరం కాకూడదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్​) రంగంలోకి దిగింది. ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆడియోలు, వీడియోలు, ప్రత్యేక ప్రచార గీతాలను రూపొందించి క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తోంది. స్థానిక యాస, ప్రజల జీవన విధానానికి దగ్గరగా ఉన్న ఈ కంటెంట్‌‌‌‌ను సోషల్ మీడియా, మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

©️ VIL Media Pvt Ltd.