
Raksha Bandhan 2026: సోదర సోదరీమణుల అనురాగానికి, ఆత్మీయతకు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ తేదీపై తరచూ గందరగోళం నెలకొంటుంది. ముఖ్యంగా ‘భద్ర కాలం’ దోషం వల్ల రాఖీ ఏ సమయంలో కట్టాలనే సందేహాలు వస్తుంటాయి. మరి 2026లో రక్షాబంధన్ ఆగస్టు 27న జరుపుకోవాలా లేక 28నా? రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం ఎప్పుడుంది? ప్రసిద్ధ పండితులు శ్రీపతి త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.. వారణాసి పంచాంగం ప్రకారం, శ్రావణ పౌర్ణమి తిథి 2026 ఆగస్టు 27వ తేదీ ఉదయం 8:31 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:18 గంటల వరకు ఉంటుంది. కాబట్టి రక్షాబంధన్ పండుగను 2026 ఆగస్టు 28, శుక్రవారం నాడు జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టు 27న ఉదయం 8:31 గంటల నుంచి రాత్రి 8:54 గంటల వరకు ‘భద్ర కాలం’ ఉంది. రాత్రి 8:54 గంటలకు భద్ర ముగుస్తుంది. శాస్త్రాల ప్రకారం భద్ర కాలంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదు. అయితే ఆగస్టు 28న ఉదయం పౌర్ణమి తిథి ఉన్న సమయంలో ఎలాంటి భద్ర దోషం లేదు. కాబట్టి 2026 రక్షాబంధన్ భద్ర దోష రహితంగా రాబోతోంది. ఆగస్టు 28న సోదరులకు రాఖీ కట్టడానికి ఎలాంటి భద్ర అడ్డంకులు ఉండవు.
రాఖీ కట్టడానికి శుభ ముహూర్తం
ఆగస్టు 28న రాఖీ కట్టడానికి అత్యంత శుభప్రదమైన సమయం. ఉదయం 05:57 గంటల నుంచి ఉదయం 09:48 గంటల వరకు మంచి ముహూర్తం ఉంటుంది. ఒకవేళ ఉదయం ముహూర్తం వీలుకాకపోతే, మధ్యాహ్నం 11:56 గంటల నుంచి 12:48 గంటల వరకు ఉన్న అభిజిత్ ముహూర్తంలో రాఖీ కట్టుకోవచ్చు.
భద్ర కాలం అంటే ఏమిటి? ఎందుకు నివారిస్తారు?
హిందూ పంచాంగంలో కరణాలలో ఒకటైన ‘విష్టి కరణం’నే భద్ర అని పిలుస్తారు. ధార్మిక నమ్మకాల ప్రకారం భద్ర ఉగ్ర స్వభావం కలిగిన సమయం. అందుకే వివాహం, గృహప్రవేశం, ఉపనయనం, యజ్ఞాలు మరియు రక్షాబంధన్ వంటి మాంగళిక కార్యాల్లో భద్ర కాలాన్ని వర్జిస్తారు. 2026లో ఆగస్టు 27నే భద్ర ముగిసిపోతుంది కాబట్టి, 28న రాఖీ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు.